సత్యేందర్ జైన్ ఆస్పత్రికి తరలింపు

Telugu Lo Computer
0


మనీల్యాండరింగ్ కేసులో ఈడీ విచారణను ఎదుర్కొంటూ ప్రస్తుతం తీహార్ జైల్‌లో ఉన్న ఢిల్లీ మాజీ మంత్రి, ఆప్ నేత సత్యేందర్ జైన్ ఆరోగ్యం క్షీణించడంతో సోమవారం సప్ధర్‌జంగ్ ఆస్పత్రికి తరలించారు. కస్టడీలో సత్యేందర్ జైన్ ఏకంగా 35 కిలోల బరువు తగ్గారని ఆయన తరపు న్యాయవాది పేర్కొంది. తాను ఒంటరి అయ్యాననే భావనతో పాటు సెల్‌లో కుంగుబాటుకు లోనవుతున్నట్టు ఇటీవల మాజీ మంత్రి పేర్కొన్నారు. జైలు లోపల ఆయన సైకాలజిస్టును సంప్రదించగా ఆయన చుట్టూ జనం ఉండేలా, అందరితో కలివిడిగా ఉండేలా చూడాలని సూచించారు. అయితే సత్యేందర్ జైన్ సెల్‌లోకి మరో ఇద్దరు ఖైదీలను బదలాయించడంతో తీహార్ జైలు అధికారులు జైల్ నెంబర్ 7 సూపరింటెండెంట్‌కు షోకాజ్ నోటీస్ జారీ చేశారు. తన సెల్‌లోకి ఇద్దరు సహచర ఖైదీలను ఉంచాలని జైల్ నెంబర్ 7 సూపరింటెండెంట్‌కు జైన్ లేఖ రాసిన క్రమంలో అధికారి ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు సత్యేందర్ జైన్ బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు మే 18న ఈడీ స్పందనను కోరింది. గత నెలలో జైన్‌కు బెయిల్ మంజూరు చేసేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరిండంతో ఆయన సర్వోన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించారు. మనీ ల్యాండరింగ్ కేసులో గత ఏడాది మే 31న ఈడీ అధికారులు జైన్‌ను అరెస్ట్ చేశాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)