తెలంగాణ లోని వనపర్తి జిల్లా అమరచింతకి చెందిన నిఖిల్ బెంగళూరులో బీఏఎంస్ చేసి అక్కడే ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఏప్రిల్ 29వ తేదీన బెంగళూరు నుంచి కావలికి వెళ్తున్న సమయంలో నిఖిల్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తలకు బలమైన గాయం కావడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కుటుంబ సభ్యులు చికిత్స అందించారు. చివరకు మే 1వ తేదీన చికిత్స పొందుతున్న నిఖిల్కు బ్రెయిన్డెడ్ అయినట్లు వైద్యులు ప్రకటించారు. అయితే.. అంత శోకంలోనూ కొడుకు ఆశయం నెరవేర్చాలని ఆ తల్లిదండ్రులు ముందుకొచ్చారు. ప్రత్యేక ఆంబులెన్స్లో నిఖిల్ను సికింద్రాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా ఆరుగురికి అవయవదాతగా నిలిచాడు. స్టూడెంట్గా ఉన్న టైంలోనే.. ఆర్గాన్ డొనేషన్ ప్రతిజ్ఞ చేసిన నిఖిల్ అందుకు సమ్మతి పత్రాన్ని సైతం ఓ ఆర్గనైజేషన్కు అందజేశాడు. ఆ సమయంలో ఆ పత్రాలకు అతను జత చేసిన కవిత ఇలా ఉంది..
నా తనువు మట్టిలో కలిసినా..
అవయవదానంతో మరొకరిలో జీవిస్తా..
ఒక అమ్మకు బిడ్డగా మరణించినా..
మరో అమ్మ పిలుపులో బతికే ఉంటా..
ఏనాడూ వెలుగులు చూడని అభాగ్యులకు నా కళ్లు..
ఆగిపోవడానికి సిద్ధంగా ఉన్న గుండెకు బదులుగా నా గుండె
కిడ్నీలు కోల్పోయిన వారికి మూత్రపిండాలు
ఊపిరి అందక ఊగిసలాడుతున్న వారికి ఊపిరితిత్తులు
కాలేయం పని చేయక కాలం ముందు ఓడిపోతున్న వారికి నా కాలేయం
నాలోని ప్రతీ అణువూ అవసరమైన వారికి ఉపయోగపడాలి
ఆపదలో ఉన్నవారిని ఆదుకోండి
ఇదే మీకు నాకు ఇచ్చే గొప్ప బహుమతి
ఇలా మీరు చేస్తే నేను కూడా సదా మీ మదిలో నిలుస్తాను.. చిరంజీవినై ఉంటాను
అవయవదానం చేద్దాం.. మరో శ్వాసలో శ్వాసగా ఉందాం
అంటూ పిలుపు ఇచ్చాడు నిఖిల్.
No comments:
Post a Comment