బ్రిటన్‌ రాజు ఛార్లెస్‌కు కిరీటధారణ !

Telugu Lo Computer
0

బ్రిటీష్‌ సామ్రాజ్యంలో 70 ఏళ్ల తర్వాత తొలి పట్టాభిషేకం జరిగింది. బ్రిటన్‌ రాజుగా ఇప్పటికే అధికారికంగా నియమితులైన మూడో ఛార్లెస్‌ సంప్రదాయాలను అనుసరించి కిరీటాన్ని ధరించారు. లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌ అబేలో శనివారం ఈ వేడుక అట్టహాసంగా జరిగింది. 2 వేల మందికి పైగా అతిథులు, రాజకుటుంబీకులు, విదేశీ ప్రముఖుల సమక్షంలో కింగ్‌ ఛార్లెస్‌-3 సింహాసనాన్ని అధిష్ఠించగా.. ఆయన సతీమణి కెమిల్లాకు రాణిగా కిరీటం అలంకరించారు. పట్టాభిషేకం నిమిత్తం కింగ్‌ ఛార్లెస్‌ దంపతులు సంప్రదాయంగా వస్తున్న బంగారు పూతతో చేసిన ప్రత్యేక బగ్గీలో కాకుండా.. ఆధునీకరించిన డైమండ్‌ జూబ్లీ స్టేట్‌ కోచ్‌ బగ్గీలో బకింగ్‌హమ్‌ ప్యాలెస్‌ నుంచి వెస్ట్‌మినిస్టర్‌ అబేకు చేరుకున్నారు. అబేకు వచ్చిన తర్వాత కాంటెర్‌బరీ ఆర్చ్‌బిషప్‌ తొలుత కింగ్‌ ఛార్లెస్‌ను పరిచయం చేశారు. అన్నివైపులా కన్పించేలా నాలుగు దిక్కులా రాజు ప్రదక్షిణ చేస్తున్నట్లు తిరుగుతుంటే ఈ పరిచయం జరిగింది. అనంతరం చట్టాన్ని కాపాడతానని, దయతో, న్యాయంతో పాలన కొనసాగిస్తానని ఛార్లెస్‌ ప్రమాణం చేశారు. తర్వాత చర్చి ఆఫ్‌ ఇంగ్లాండ్‌కు నమ్మకస్థుడైన క్రిస్టియన్‌గా ఉంటానని ఛార్లెస్‌ రెండో ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమం పూర్తయ్యాక సభికులు 'భగవంతుడు రాజును రక్షించుగాక' (గాడ్‌ సేవ్‌ కింగ్‌) అంటూ ఆలపించారు. ప్రమాణం ముగియగానే సభలో ప్రార్థనలు చేశారు. బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ బైబిల్‌లోని కొన్ని పంక్తులను పఠించారు. ఈసారి పట్టాభిషేక వేడుకలో భిన్న మత విశ్వాసాలకు పెద్ద పీట వేస్తున్నట్లు కాంటెర్‌బరీ ఆర్చ్‌బిషప్‌ కార్యాలయం అంతకుముందు తెలిపింది. ప్రమాణం, ప్రార్థనల తర్వాత 1300 సంవత్సరంలో కింగ్‌ ఎడ్వర్డ్‌ చేయించిన సింహాసనాన్ని కింగ్ ఛార్లెస్‌-3 అధిష్ఠించారు. ఈ సింహాసనం కింది అరలో స్కాట్లాండ్‌ నుంచి తెచ్చిన పవిత్ర రాయిని ఉంచారు. అనంతరం కింగ్‌ ఛార్లెస్‌ను జెరూసలెం నుంచి తెచ్చిన పవిత్ర నూనెతో అభిషేకించారు. చేతులు, ఛాతీ, తలపై నూనెను పోశారు. ఇదంతా తెరచాటున జరిగింది. నూనెతో అభిషేకం పూర్తయిన తర్వాత ఛార్లెస్‌ బంగారుతాపడంతో చేసిన మహారాజ గౌన్‌ ధరించి సింహాసనంపై కూర్చున్నారు. ఆ తర్వాత శిలువతో ఉన్న గోళాకారంలో ఉండే బంగారు రాజముద్ర, రాజదండంను ఆర్చ్‌బిషప్‌ ఆయనకు అందించారు. కుడిచేతి నాలుగో వేలుకు ఉంగరం తొడిగిన అనంతరం కిరీటధారణ చేశారు. ఆ తర్వాత సభికులంతా 'గాడ్‌ సేవ్‌ కింగ్‌' అంటూ నినాదాలు చేశారు. అనంతరం రాజు ఛార్లెస్‌ పట్టాభిషేక కుర్చీలోంచి లేచి.. రాజ ఖడ్గాన్ని చేతిలో పట్టుకుని ప్రత్యేకంగా చేయించిన సింహాసనంపై ఆసీనులయ్యారు. సింహాసనంపై రాజు కూర్చోగానే ఆర్చ్‌బిషప్‌తో పాటు యువరాజు ప్రిన్స్‌ విలియం మోకాళ్లపై వంగి కూర్చొని రాజు కాళ్లకు చేతిని ఆనించి ఆయన కుడి చేతిని ముద్దాడారు. అనంతరం రాణి కెమిల్లాపై పవిత్ర నూనె చల్లి నిరాడంబరంగా కిరీట ధారణ చేశారు. రాచరికాన్ని వదులుకుని రాజకుటుంబానికి దూరమైన ఛార్లెస్‌-3 చిన్న కుమారుడు ప్రిన్స్‌ హ్యారీ కూడా పట్టాభిషేకానికి హాజరయ్యారు. ఈ వేడుకలో తన కజిన్స్‌తో కలిసి నడిచిన హ్యారీ నవ్వుతూ కన్పించారు. అయితే ఈ కార్యక్రమానికి హ్యారీ ఒంటరిగానే వచ్చారు. భార్య మేఘన్‌ మార్కెల్‌, ఆయన ఇద్దరు పిల్లలు అమెరికాలోనే ఉన్నారు. హ్యారీ కుమారుడు ఆర్కీ ఈ రోజు నాలుగో పుట్టినరోజు జరుపుకొంటున్నాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)