పొలంలో కంటపడ్డ మొసలి !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం చెన్నాపురం గ్రామంలో మొసలి కలకలం రేపింది. గ్రామానికి చెందిన వెంకట రాముడు అనే రైతు పొలంలో వరి గడ్డిని తొలగిస్తుండగా ఒక్కసారి మొసలిను చూసి ఉలిక్కిపడ్డాడు. విషయం తెలియడంతో గ్రామంలోని స్థానికులు అందరూ పొలం దగ్గరకు చేరుకొని మొసలిని ఆసక్తిగా తిలకించారు. పొలం పక్కన ఉన్న ఎల్‌ఎల్‌సి కాల్వ నుంచి మొసలి పొలంలోకి వచ్చినట్టు గ్రామస్తులు గుర్తించారు. దాన్ని గుర్తించకపోతే పెను ప్రమాదం జరిగి ఉండేదని గ్రామస్తులంతా భయాందోళన చెందారు. సమాచారంతో అందడంతో స్పాట్‌కు చేరకున్న అటవీ శాఖ సిబ్బంది అతి కష్టంపై మొసలిని బంధించారు. బంధించే క్రమంలో మొసలి రెండు కాళ్లకు తీవ్ర గాయాలైనట్లు పశువైద్యాధికారులు గుర్తించారు. అనంతరం అటవీశాఖ అధికారులు మొసలిని అక్కడినుంచి వాహనంలో ఆదోని ఫారెస్ట్ ఆఫీసుకు తరలించారు. ప్రస్తుతం ఎండాకాలం అవ్వడంతో ఎల్‌ఎల్‌సి కాలువలో నీటి ప్రవాహం తగ్గిపోయిందని, అందుకే మొసలి పొలాల్లోకి వచ్చి ఉంటుందని అధికారులు తెలిపారు. సమ్మర్‌లో వన్యప్రాణులు వేసవి తాపంతో, దాహంతో జనావాస ప్రాంతాల్లోకి వచ్చే అవకాశం ఉందని అలాంటి సమయాల్లో తమకు సమాచారం ఇవ్వాలని ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ సిబ్బంది సూచించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)