దివిటిపల్లిలో 'అమరరాజా గిగా కారిడార్‌'కు శంకుస్థాపన !

Telugu Lo Computer
0


లిథియం సెల్స్‌, బ్యాటరీ ప్యాక్‌ల తయారీకి మహబూబ్‌నగర్‌ జిల్లా దివిటిపల్లిలో 'అమరరాజా గిగా కారిడార్‌'కు అమరరాజా బ్యాటరీస్‌ శంకుస్థాపన చేసింది.  దివిటిపల్లిలో ప్లాంట్ పెడుతామని ప్రకటించిన తర్వాత 8 రాష్ట్రాల సీఎంలు, మంత్రులు వారికి ఫోన్ చేసి తమ తమ రాష్ట్రాలకు రావాలని ఆహ్వానించారని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. కానీ అమరరాజా గ్రూప్ వారు ఇక్కడే ప్లాంట్ ప్రారంభించేందుకు సముఖత వ్యక్తం చేశారని చెప్పారు. దీని ద్వారా పది వేల మందికి ఉపాధి లభించనుంది. అమరరాజా గ్రూప్ రాబోయే పదేండ్ల కాలంలో రూ. 9,500 కోట్ల పెట్టుబడి పెట్టబోతుంది. మూడు సంవత్సరాల్లో రూ. 3 వేల కోట్లు పెట్టుబడి పెట్టనుంది. మిగతా పెట్టుబడి దశల వారీగా పెట్టనుంది. అమరరరాజా యొక్క 37 ఏండ్ల చరిత్ర పరిశీలిస్తే.. దానికి రెట్టింపు ఈ ఒక్క ప్లాంట్‌లోనే పెట్టుబడి పెడుతున్నారు.  దీని ద్వారా దాదాపు 10 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది. సుమారు 270 ఎకరాల్లో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి గత ఏడాది డిసెంబరులో తెలంగాణ ప్రభుత్వం, అమరరాజా బ్యాటరీస్‌ అనుబంధ కంపెనీ అమరరాజా అడ్వాన్స్‌డ్‌ సెల్‌ టెక్నాలజీస్‌ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. అమరరాజా కంపెనీ ఏర్పాటుతో మహబూబ్‌నగర్‌ దశ మారిపోతుందని, ఈ ప్రాంతం పరిశ్రమలకు అడ్డాగా మారబోతోందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. రాష్ట్రం ఏర్పడే నాటికి హైదరాబాద్ ఐటీ రంగంలో 3లక్షల 23 వేల మంది పని చేసేవారు. ఇప్పుడు దాదాపు 10 లక్షల మంది ప్రత్యక్షంగా పని చేస్తున్నారని కేటీఆర్ వివరించారు. ఒక ఐటీ కంపెనీ ఉంటే దాని చుట్టూ ఎన్నో ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. అమరారాజ యూనిట్ రావడం వల్ల చుట్టు పక్కల ప్రాంతాల రూపురేఖలు మారిపోతాయి. పెద్ద ఎత్తున పరిశ్రమలు కూడా వస్తాయని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రయివేటు రంగంలో పెట్టుబడులను ఆహ్వానించేందుకు అంతర్జాతీయ వేదికలపై ఆయా రాష్ట్రాలు పోటీ పడుతున్నాయన్నారు. తమ వద్ద సరిపడ కరెంటు, నీళ్లు, భూములు ఉన్నాయి. మంచి ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. అభివృద్ధి నిరోధకులు, ప్రగతి నిరోధకులు ఈ ప్రాంతం బాగు పడొద్దనే ఉద్దేశంతో పుకార్లు సృష్టించి, జరిగే మంచి పనికి విఘాతం కలిగించేప్రయత్నం చేస్తారని కేటీఆర్ పేర్కొన్నారు. బ్యాటరీ పరిశ్రమ అని కాలుష్యం వస్తుందని మాట్లాడుతున్నారు. ఇది లిథియం అయాన్ బ్యాటరీ మేకింగ్ కంపెనీ. భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ వాహనాలదేనని వివరించారు. రాబోయే 20, 30 ఏండ్లలో పెట్రోల్, డిజీల్ వాహనాలను పక్కన పెట్టి.. ఎలక్ట్రిక్ వాహనాలను వాడుతారని చెప్పారు. ఆ ఎలక్ట్రిక్ వాహనాల్లో వాడే బ్యాటరీనే ఇక్కడ తయారవుతుంది. సంప్రదాయ బ్యాటరీ వల్ల కాలుష్యం కొంత కలుగుతుంది. జీరో లిక్విడ్ డిశ్చార్జితో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ కంపెనీ ఏర్పాటు చేస్తున్నారని వివరించారు. లిథియం అయాన్ బ్యాటరీలతో ఒక్క చుక్క కాలుష్యం కూడా జరగదని. లెడ్ యాసిడ్ బ్యాటరీలు తయారు చేయట్లేదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేసారు.

Post a Comment

0Comments

Post a Comment (0)