గుజరాత్‌ లో బోగస్‌ కంపెనీలు సృష్టించి జీఎస్టీ ఎగవేత !

Telugu Lo Computer
0


నకిలీ బిల్లుల మాఫియాకు గుజరాత్‌ అడ్డాగా మారింది. పేదల ఆధార్‌ నంబర్లతో నకిలీ కంపెనీలను రిజిస్టర్‌ చేయించి, వేల కోట్ల జీఎస్టీ ఎగ్గొడుతున్న కుంభకోణం బయటపడింది. రూ.20 వేల కోట్లకు గానూ 25 శాతం అంటే రూ.5 వేల కోట్ల నకిలీ బిల్లులు గుజరాత్‌ నుంచే ఉన్నాయని జీఎస్టీ అధికారులు చెప్తున్నారు. ఈ బిల్లులతో ఎగవేసిన పన్నుల విలువ వందల కోట్లకు చేరుకొన్నాయని పేర్కొన్నారు. ఇప్పటికే ఈ కుంభకోణంలో కీలకంగా గుర్తించిన మహ్మద్‌ టాటాతో సహా మొత్తం 24 మందిని అరెస్టు చేశారు. సిట్‌ బృందం 461 బోగస్‌ కంపెనీలను గుర్తించి, 236 మందిని విచారించిందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. భావ్‌నగర్‌ కేంద్రంగా ఈ తంతు సాగుతున్నదని జీఎస్టీ అధికారులు పేర్కొన్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, తమిళనాడుతో పాటు ఈశాన్య రాష్ర్టాల్లో నకిలీ బిల్లులతో జీఎస్టీ ఎగ్గొడుతున్న కంపెనీలను సిట్‌ గుర్తించింది. పలువురి పేదల ఆధార్‌ నంబర్లు సేకరించి వాటితో పాన్‌ కార్డులు, తర్వాత నకిలీ కంపెనీలు సృష్టించి జీఎస్టీ రిజిస్ట్రేషన్లు చేయించుకున్నట్టు తేల్చింది. మహ్మద్‌ టాటాకు సహకరించిన మేఘాని అనే మరో వ్యక్తిని భావ్‌నగర్‌ పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. మహ్మద్‌ టాటా కోసం మేఘాని 53 షెల్‌ కంపెనీలను సృష్టించాడు. మహ్మద్‌ టాటా పేరుపై ఉన్న 3 షెల్‌ కంపెనీలే 110 కోట్ల రూపాయల విలువైన నకిలీ బిల్లులు సృష్టించాయని పోలీసులు పేర్కొన్నారు. ఫిబ్రవరిలో ఎస్‌జీఎస్టీ అధికారులు కంపెనీ రిజిస్ట్రేషన్ల వెరిఫికేషన్‌ డ్రైవ్‌ చేపట్టారు. అనుమానంతో అహ్మదాబాద్‌, సూరత్‌, రాజ్‌కోట్‌, ఆనంద్‌, భావ్‌నగర్‌లో తనిఖీలు చేపట్టారు. దాదాపు 100 కంపెనీలపై దాడులు నిర్వహించగా, సూరత్‌కు చెందిన 61, అహ్మదాబాద్‌కు చెందిన 13 సంస్థలు బోగస్‌ అని గుర్తించారు. సూరత్‌లోని షెల్‌ కంపెనీల జీఎస్టీ రిజిస్ట్రేషన్లకు లింక్‌ అయిఉన్న ఆధార్‌ నంబర్లకు భావ్‌నగర్‌, పాలిటానా, అమ్రేలి, అహ్మదాబాద్‌, ఆనంద్‌ జిల్లాల్లో చిరునామాలు ఉన్నట్టు గుర్తించారు. కాగా, పాలిటానాలోని ఆధార్‌ హోల్డర్లు.. తమ పేర్లపై పొందిన పాన్‌ నంబర్ల గురించి తమకు తెలియదని చెప్పారు. పాలిటానా, భావ్‌నగర్‌లోని ఆధార్‌ కేంద్రాలపై ఎస్‌జీఎస్టీ అధికారులు నిర్వహించిన దాడుల్లో 2,800 ఆధార్‌ కార్డులకు ఫోన్‌ నంబర్లు మార్చినట్లు గుర్తించారు. ఆ ఆధార్‌ నంబర్లు ఉపయోగించి, అసలు వ్యక్తులకు తెలియకుండానే పాన్‌ కార్డులు పొంది, ఆ తర్వాత నకిలీ కంపెనీలు, జీఎస్టీ రిజిస్ట్రేషన్లు పొందినట్టు విచారణలో తేలింది. ఇలా ఇతర రాష్ర్టాల్లోనూ జరిగినట్టు అధికారులు గుర్తించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)