మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన ఆప్ నేత, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ అనారోగ్యం రీత్యా సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయనకు ఈ కేసులో తాత్కాలిక ఉపశమనం లభించినట్లయ్యింది. సత్యేందర్ జైన్ను ఢిల్లీ వదలి వెళ్లొద్దని చెబుతూ ధర్మాసనం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ ఉత్తర్వు జూలై 11 వరకు అమలులో ఉంటుందని, అలాగే ఆయన ఆరోగ్యానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను కోర్టుకి సమర్పించాలని ఆదేశించింది. మనీలాండరిగ్ కేసులో గతేడాది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సత్యేందర్ జైన్ను మే 30న అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పలుమార్లు కోర్టులో బెయిల్ కోసం ప్రయత్నించగా ఎదురుదెబ్బలు తగులుతూ వచ్చాయి. ఇదిలా ఉంటే ఆహారపు అలవాట్ల మార్పుతో జైన్ అనారోగ్యం పాలయ్యారు. జైన్ గురువారం శ్వాసకోసం ఇబ్బందులతో అకస్మాత్తుగా జైల్లో కళ్లుతిరిగి పడిపోయారు. ఈ నేపథ్యంలో అధికారులు ఆయన్ని హుటాహుటినా జయప్రకాశ్ నారాయణ ఆస్పత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందించారు. ఈ విషయాలన్నీ పరిగణనలోకి తీసుకున్న సుప్రీం కోర్టు అనారోగ్యం రీత్యా జైన్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినట్లు తెలుస్తోంది.
సత్యేందర్ జైన్కు మధ్యంతర బెయిల్ మంజూరు
May 26, 2023
0
Tags