గుజరాత్ నుంచి ఐదేండ్లుగా 40,000 మంది మహిళలు అదృశ్యమయ్యారన్న నివేదికల నేపధ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా లక్ష్యంగా ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) విమర్శలు గుప్పించింది. జాతీయ నేర గణాంకాల బ్యూరో (ఎన్సీఆర్బీ) డేటా ఆధారంగా సేన పత్రిక సామ్నా సంపాదకీయం కాషాయ పార్టీ అగ్రనేతలపై మండిపడింది. మానవ అక్రమ రవాణాలో మహిళలు చిక్కుకుపోవడం తీవ్రమైన విషయం కాగా, మోడీ భక్తులు ఇంకా గుజరాత్ మోడల్ గురించి భజన చేస్తున్నారని సామ్నా సంపాదకీయం ఆక్షేపించింది. కశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ వంటి సినిమాలు కాకుండా గుజరాత్లో అదృశ్యమవుతున్న మహిళలు, బాలికల గురించి ఫిల్మ్ మేకర్ వివేక్ అగ్నిహోత్రి గుజరాత్ ఫైల్స్ సినిమా తీయాలని ఎడిటోరియల్ పేర్కొంది. మహారాష్ట్రలోనూ అదృశ్యమవుతున్న మహిళల సంఖ్య ఆందోళన రేకెత్తిస్తోందని తెలిపింది. రోజూ సగటున 70 మంది రాష్ట్రం నుంచి మహిళలు గల్లంతవుతున్నారని, గత మూడు నెలలుగా ఏకంగా ఐదు వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని గణాంకాలు వెల్లడించాయని పేర్కొంది. రాష్ట్రం నుంచి మహిళలు అదృశ్యమవుతుంటే షిండే-ఫడ్నవీస్ సర్కార్ ఏం చేస్తోందని సామ్నా ఎడిటోరియల్ నిలదీసింది. గుజరాత్, మహారాష్ట్రలో పేద, అణగారిన వర్గాల మహిళల సమస్యలను పరిష్కరించకుండా ఇరు ప్రభుత్వాలు బజరంగ్ బలి, హనుమాన్ చాలీసా, మత మార్పిళ్ల వంటి అంశాలను లేవనెత్తుతున్నాయని ఆరోపించింది.
గుజరాత్ లో 40,000 మంది మహిళల అదృశ్యం
May 09, 2023
0
Tags