ఆగంతకుల కాల్పులకు నలుగురు జవాన్ల బలి

Telugu Lo Computer
0


పంజాబ్‌లోని భటిండా మిలిటరీ స్టేషన్‌లో బుధవారం తెల్లవారు జామున 4.35 గంటల ప్రాంతంలో ఆగంతకులు జరిపిన కాల్పులకు నలుగురు జవాన్లు మృతి చెందారు. కాల్పులు వినిపించగానే స్టేషన్ లోని క్విక్ రియాక్షన్ బృందాలు అప్రమత్తమై ఆ ప్రాంతాన్ని ఆధీనం లోకి తీసుకొని గాలింపు చేపట్టాయి. దీంతో నిందితులు అక్కడి నుంచి పారిపోయనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వారి కోసం గాలిస్తున్నారు. మిలిటరీ స్టేషన్‌ను మూసివేసి కార్డన్ సెర్చ్ చేపట్టినట్టు స్ధానిక అధికారులు తెలిపారు. ఈ ఘటన సైనిక స్థావరం లోని శతఘ్ని యూనిట్‌లో చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. అక్కడ ఉన్న ఓ ఆఫీసర్స్ మెస్‌లో ఇది జరిగినట్టు భావిస్తున్నారు. ఆ ప్రదేశం లోనే సైనికుల కుటుంబాలు కూడా నివసిసుతన్నాయి. పౌర దుస్తుల్లో వచ్చిన ఇద్దరు వ్యక్తులు కాల్పులకు పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. రెండు రోజుల క్రితమే ఈ సైనిక స్థావరంలో ఒక ఇన్సాస్ రైఫిల్, 28 తూటాలు అదృశ్యమయ్యాయి. ఈ ఘటనలో వీటిని వాడి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఆర్మీస్పందించింది. " ఈ ఘటనలో ఫిరంగి దళానికి చెందిన నలుగురు జవాన్లు మృతి చెందారు. మృతుల కుటుంబాలకు సమాచారం అందించాం. ఇంకెవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఆస్తినష్టం సంభవించలేదు. ప్రస్తుతం ఘటనాస్థలంలో గాలింపు కొనసాగుతోంది. పంజాబ్ పోలీసులతో కలిసి ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నాం. రెండు రోజుల క్రితం ఇన్సాస్ రైఫిల్, 28 తూటాల అదృశ్యం అవడం పైనా దృష్టి పెట్టాం. "' అని ఆర్మీ అధికారిక ప్రకటనలో వెల్లడించింది. అటు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ఘటన వివరాలను నివేదించినట్టు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటన సమాచారం అందగానే పంజాబ్ పోలీసులు మిలిటరీ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. అయితే ఆ ప్రాంతాన్ని ఆర్మీ అధికారులు తమ ఆధీనం లోకి తీసుకోవడంతో వారిని లోపలికి అనుమతించలేదని భటిండా సీనియర్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ వెల్లడించారు. కాగా, కాల్పుల ఘటనలో ఉగ్ర కోణం ఉండే అవకాశాలు తక్కువగా ఉన్నట్టు పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. బఠిండా వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన సైనిక స్థావరం. ఇక్కడ కీలకమైన 10 వ కోర్ కమాండ్‌కు చెందిన దళాలు ఉన్నాయి. జైపూర్ కేంద్రంగా పనిచేసే సౌత్ వెస్ట్రన్ కమాండ్ ఆధీనంలో ఈ స్థావరం పనిచేస్తుంది. బఠిండాలో పెద్ద సంఖ్యలో ఆపరేషనల్ ఆర్మీ యూనిట్లు, ఇతర కీలక పరికరాలు ఉన్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)