రాజస్థాన్లోని జైపూర్కు చెందిన దినేశ్ కుమార్ సక్సేనా (66) పడిపోవడంతో తుంటి ఎముక విరిగింది. రాజస్థాన్లో వైద్యులు సమ్మె చేస్తుండడంతో కుటుంబీకులు నోయిడాలోని ఫోర్టిస్ ఆసుపత్రికి శనివారం తరలించారు. మంగళవారం రోగికి యాంజియోగ్రఫీ చేశారు. తన తండ్రికి గతంలో రెండుసార్లు యాంజియోప్లాస్టీ చేయించుకున్నాడని మృతుడి కుమారుడు శుభమ్ సక్సేనా తెలిపాడు. బుధవారం ఉదయం వరకు ఆయన పరిస్థితి బాగానే ఉందని, యాంజియోగ్రఫీ చేసిన సందర్భంలో తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని శుభమ్ ఆరోపించారు. సాయంత్రం 4.30 గంటల సమయంలో ఐసీయూ చేరుకునే సరికి తన తండ్రి అపస్మారక స్థితిలో పడి ఉన్నాడని, అనుమానం వచ్చి వైద్యులను ప్రశ్నిస్తే 5 గంటల సమయంలో మృతి చెందినట్లు సమాచారం ఇచ్చాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఆసుపత్రి యాజమాన్యం తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతుడి బంధువులను శాంతింపజేశారు. అయితే, మృతదేహాన్ని తీసుకువెళ్లేందుకు బంధువులు నిరాకరించారు. ఆసుపత్రి వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఆసుపత్రి యాజమాన్యం క్లారిటీ ఇచ్చింది. రోగి అప్పటికే గుండె, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారని దవాఖాన నిర్వాహకులు తెలిపారు. మృతుడికి షుగర్ ఎక్కువగా ఉందని, తుంటి ఆపరేషన్కు ముందు పరిస్థితిని కంట్రోల్ చేయడం అవసరమని పేర్కొన్నారు. రోగికి సంబంధించిన ప్రతి అప్డేట్ను బంధువులకు అందించామని, చికిత్స విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయలేదని తెలిపింది. మృతుడి కుటుంబీకుల ఆరోపణలు నిరాధారమని ఖండించింది.
తుంటి విరిగితే గుండెకు ఆపరేషన్ చేశారు !
April 06, 2023
0
Tags