అత్యాధునిక హంగులతో ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ ప్రారంభించిన ప్రధాని

Telugu Lo Computer
0


చెన్నై విమానాశ్రయంలో నూతనంగా ఏర్పాటు చేసిన అత్యాధునిక ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ను ప్రారంభించారు. రూ.1,250 కోట్ల నిధులతో ఈ టెర్మినల్‌ నిర్మాణాన్ని చేపట్టారు. రెండు దశల్లో చెన్నై విమానాశ్రయాన్ని ఆధునీకరించాలని కేంద్రం నిర్ణయించింది. తొలి విడతగా రూ.1,250 కోట్లతో పనులు చేపట్టారు. తాజా నిర్మాణంతో చెన్నైలోని మౌలిక సదుపాయాల్లో మరొకటి చేరినట్లయింది. ఇది జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చెన్నై నగరాన్ని అనుసంధానించడంతో కీలకం కానుంది. అంతేకాకుండా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఇది సహకరించనుంది. నూతన టెర్మినల్‌ వల్ల ప్రయాణికుల రాకపోకలు ఏడాదికి 23 మిలియన్ల నుంచి 30 మిలియన్లకు పెరుగుతుంది. 100 చెక్‌ ఇన్‌ కౌంటర్లు, 108 ఇమ్మిగ్రేషన్‌ కౌంటర్లు, 17 ఎస్కలేటర్లు, 17 ఎలివేటర్లు కొత్తగా అందుబాటులోకి వచ్చాయి. చెన్నై విమానాశ్ర అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కొత్తగా ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ 2.20 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది. తమిళనాడుకు ఏటా ఎయిర్‌ ట్రాఫిక్‌ పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా దీని నిర్మాణం చేపట్టారు. మొత్తం 108 ఇమ్మిగ్రేషన్‌ కౌంటర్లను రెండు భాగాలు విభజించారు. ఇక్కడి నుంచి వెళ్లేవారి కోసం 54 కౌంటర్లు, విదేశాల నుంచి వచ్చే వారి కోసం 54 కౌంటర్లను వినియోగించనున్నారు. దీనివల్ల ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. అతి తక్కువ సమయంలోనే ఇమ్మిగ్రేషన్‌ ప్రక్రియ పూర్తి కానుంది.నూతన ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ను సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్మించారు. దక్షిణ భారతదేశంలోని ఇళ్లలో ప్రవేశ ద్వారాల వద్ద కనిపించే రంగోళి, కోలం లాంటి గుర్తులు దర్శనమిస్తాయి. చీరలు, దేవాలయ నమూనాలు కూడా టెర్మినల్‌లో కనిపిస్తాయి. పర్యావరణ హితంగా ఉండేలా అత్యాధునిక ఇంజినీరింగ్‌ పరిజ్ఞానంతో టెర్మినల్‌ నిర్మాణాన్ని చేపట్టారు.

Post a Comment

0Comments

Post a Comment (0)