కర్ణాటక శాసనసభ ఎన్నికలకు దూరంగా ఉండాలని భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నిర్ణయించింది. గతంలోనే తీసుకున్న నిర్ణయం మేరకు అక్కడ లోక్సభ ఎన్నికల్లోనే పోటీ చేస్తామని పేర్కొంది. అయితే కర్ణాటకలో పరిస్థితులు ఎలా ఉంటాయి? ఎన్నికల్లో అక్కడి ఏయే పా ర్టీలు ఎలాంటి వ్యూహాలను అమలు చేస్తాయి? పొత్తులు, ఇతర అంశాల ప్రభావం ఏమిటి? అన్న అంశాలను బీఆర్ఎస్ క్షుణ్నంగా పరిశీలించనుంది. ఇందుకోసం ప్రత్యేక బృందాన్ని కర్ణాటకకు పంపనుంది. మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఇటీవల నిర్ణయించారు. ఈ క్రమంలోనే మహారాష్ట్రలో బీఆర్ఎస్ను రిజిస్టర్ చేయడంతోపాటు పార్టీ బలోపేతం లక్ష్యంగా ఎన్సీపీ, కాంగ్రెస్, బీజేపీ తదితర పా ర్టీల నుంచి చేరికలను ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటికే నాందేడ్, కాంధార్-లోహలో బహిరంగ సభలు నిర్వహించారు. మరిన్ని సభలు, సమావేశాలకు సన్నాహాలు చేస్తున్నారు. కర్ణాటకలో ప్రత్యక్ష పోటీకి దూరంగా ఉంటూనే చురుకైన పాత్ర పోషించాలనే యోచనలో కేసీఆర్ ఉన్నట్టు సమాచారం. వచ్చే ఏడాది జరిగే లోక్సభ ఎన్నికల నాటికి కర్ణాటకలో అడుగుపెట్టనున్న నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలను నిశితంగా అధ్యయనం చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ఒకట్రెండు రోజుల్లో ప్రత్యేక కమిటీని ప్రకటించే అవకాశం ఉందని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. కర్ణాటకలో ప్రధాన రాజకీయపక్షాలైన బీజేపీ, కాంగ్రెస్, జేడీ(యూ) ఎన్నికల ఎత్తుగడలపై కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి సారించారని తెలిపాయి. గతంలో హైదరాబాద్ స్టేట్లో అంతర్భాగంగా ఉండి ప్రస్తుతం కల్యాణ కర్ణాటకగా పిలుస్తున్న బీదర్, రాయచూర్, యాద్గిర్, కొప్పల్, కలబుర్గి జిల్లాల్లో బీఆర్ఎస్ బలోపేతం లక్ష్యంగా కొంత హడావుడి జరిగింది. మంత్రి వి.శ్రీనివాస్గౌడ్, నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్రెడ్డితోపాటు పలువురు బీఆర్ఎస్ నేతలు తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో పర్యటించి వివిధ పా ర్టీల నేతలతో భేటీ అయ్యారు. కర్ణాటకపై ఫోకస్ తగ్గించి మహారాష్ట్ర, ఏపీ, ఒడిశా రాష్ట్రాలపై దృష్టిపెట్టారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా.. అక్కడ అధికారంలో ఉన్న బీజేపీతోపాటు విపక్ష కాంగ్రెస్ వ్యతిరేక ఓటు బ్యాంకులో చీలికను నివారించడం, భావసారూప్య పార్టీ జనతాదళ్ (సెక్యులర్)కు మేలు చేసేందుకే కన్నడ రాజకీయాలపై ఫోకస్ తగ్గించినట్టు బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి.
కర్ణాటక ఎన్నికలకు బీఆర్ఎస్ దూరం
March 30, 2023
0
Tags