కారులో సెక్యూరిటీ గార్డు సజీవ దహనం !

Telugu Lo Computer
0


హైదరాబాద్‌ లోని అబిడ్స్‌, బొగ్గుల కుంటలోని కామినేని హాస్పిటల్ పక్కనే వున్న కారు మెకానిక్‌ షెడ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.క్రమంగా ఆమంటలు గ్యారేజీ మొత్తానికి మంటలు వ్యాపించడంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. దీంతో భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. భయభ్రాంతులైన కింగ్ కోఠి కామినేని హాస్పిటల్ సిబ్బంది ఫైర్‌ సిబ్బందికి సమాచారం అందించారు. హుటా హుటిన ఘటనాస్థలికి చేరుకున్న సిబ్బంది మంటలను పూర్తిగా అదుపు చేశారు. ఈ ప్రమాదంలో దాదాపు ఐదు కార్లు దగ్ధమయ్యాయి. ఐదుకార్లలో ఒక కారులో సెక్యూరిటీ గార్డు నిద్రపోయాడు. అందులో కూడా మంటలు అంటుకోవడంతో సెక్యూరిటీ గార్డు మంటల్లో చిక్కుకుని చనిపోయాడు. కారులో సజీవ దహనమైన సెక్యూరిటీ గార్డు సంతోష్‌ గా పోలీసులు గుర్తించారు. ఈ సమాచారాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. సెక్యూరిటీ గార్డ్‌ సంతోష్‌ కు తల్లిదండ్రులు, భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. తను కుటుంబాన్ని పోషించుకునేందుకు రెండు ఉద్యోగాలు చేస్తున్నాడు. అబిడ్స్‌లో ఉదయం చెప్పులు కుట్టడం, రాత్రి సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం చేస్తున్నాడు. రోజు మాదిరిగానే నిన్న ఉదయం ఇంట్లోంచి ఉద్యోగానికి వెళ్ళిన సంతోష్ చెప్పులు దుకాణంలో విధులు ముగించుకొని కార్ల గ్యారేజ్ లో డ్యూటీకి వచ్చాడు. రాత్రి భోజనం చేసిన తరువాత పన్నెండు గంటలకు తల్లికి ఫోన్ చేసి మాట్లాడాడు. తిన్నానని పడుకుంటున్నాని తల్లికి చెప్పి సంతోష్ కారులో నిద్రించాడు. ఉదయం సంతోష్ చనిపోయాడని ఫోన్ చేసి చెప్పడంతో గ్యారేజ్ దగ్గరికి పరుగెత్తుకుంటూ కుటుంబ సభ్యులు వచ్చారు. ఈ మధ్యనే సంతోష్ అన్న చనిపోయాడని ఇప్పుడు చిన్న కొడుకు కూడా చనిపోవడంతో కన్నీరుమున్నీరయ్యారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా వుండి పోషిస్తూ వస్తున్న సంతోష్‌ కూడా చనిపోయాడని ఇక మాకు దిక్కెవరని వాపోయారు. సంతోష్‌ కుటుంబ సభ్యుల రోదనలు విని స్థానికులు చలించిపోయారు. అయితే.. కామినేని హాస్పిటల్ కి అనుకునే ప్రమాదం చోటుచేసుకోవడంతో ఆసుపత్రి సిబ్బంది, పేషంట్లను తరలించేందుకు సిద్దమయ్యారు. అంతేకాకుండా.. ప్రమాద ఘటనకు పక్కనే హాస్పిటల్ కి సంబంధించిన పవర్ జనరేటర్స్ కూడా ఉన్నాయి. అయితే ఫైర్‌ సిబ్బంది సకాలంలో చేరుకుని మంటలను అదుపుచేయడంతో ఊపిరి పీల్చుకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)