మహారాష్ట్ర అభివృద్ధి గురించి బీజేపీ నేతలు గొప్పలు చెప్పడంపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే మండిపడ్డారు. మహారాష్ట్రను తీర్చిదిద్దింది ప్రధాని మోదీ కాదని, ఛత్రపతి శివాజీ మహరాజ్ అని వ్యాఖ్యానించారు. బీజేపీ హయాంలో దేశంలో ప్రజాస్వామ్యం కూనీ అవుతున్నదని ఉద్ధవ్ ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాల్సిన నాలుగు స్తంభాల్లో ఇప్పటికే మూడు స్తంభాలు కూలిపోయాయని.. కేవలం న్యాయవ్యవస్థ, సుప్రీంకోర్టు మీద మాత్రమే ఆశలు ఉన్నాయని చెప్పారు. ఇక మీడియా అయితే తన చేతుల్లో కలానికి బదులుగా కమలం పువ్వును పట్టుకుందని ఎద్దేవా చేశారు. బీజేపీ రథయాత్ర చేపట్టినప్పుడు ఆ పార్టీకి కేవలం ఇద్దరు ఎంపీలు మాత్రమే ఉన్నారని, అద్వానీ ఆ పార్టీ ప్రధాన నాయకుడని ఉద్ధవ్ థాకరే గతాన్ని గుర్తుచేశారు. అప్పుడు బీజేపీ రథయాత్రకు తాము మద్దతు నిలిచామన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం బీజేపీ లౌకికత్వం పేరుతో అద్వానీని విమర్శించిన జయలలిత, ఇతర పార్టీల మద్దతు తీసుకుందని విమర్శించారు. ఆ విధంగా లౌకిక శక్తులతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని, అటల్ బిహారీ వాజ్పేయి ప్రధాని అయ్యారని ఉద్ధవ్ నొక్కి చెప్పారు. అలాంటప్పుడు హిందూయిజాన్ని ఎవరు వదిలేసినట్లని.. బీజేపీయా, శివసేననా..? అని ప్రశ్నించారు.
మహారాష్ట్రను తీర్చిదిద్దింది మోడీ కాదు !
March 15, 2023
0
Tags