వారిస్ పంజాబ్ దె చీఫ్‌ అమృత్‌పాల్ సింగ్ అరెస్టు

Telugu Lo Computer
0


పంజాబ్ లోని జలంధర్ పట్టణంలో ఖలిస్తాన్ వేర్పాటువాద నేత అమృత్‌పాల్ సింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి అరెస్టు నేపథ్యంలో ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా జలంధర్‌తోపాటు అనేక ప్రాంతాల్లో భారీ స్థాయిలో పోలీసులు మోహరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. ఆదివారం మధ్యాహ్నం వరకు ఇంటర్నెట్ సేవలు నిలిచి ఉంటాయని పోలీసులు చెప్పారు. అమృత్‌పాల్ సింగ్‌ ఖలిస్తాన్ వేర్పాటువాద ఉద్యమాన్ని నడిపిస్తున్నాడు. అతడు వారిస్ పంజాబ్ దె చీఫ్‌గా కొనసాగుతున్నాడు. తన సంస్థ ద్వారా అనేక మందిని రెచ్చగొట్టి ఖలిస్తాన్ ఉద్యమం వైపు నడిపిస్తున్నాడు. అమృత్‌పాల్ సింగ్‌ కంటే ముందు అతడి ఎనిమిది మంది ముఖ్య అనుచరుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చాలాకాలంగా వారిపై నిఘా పెట్టిన పోలీసులు, పక్కా ప్రణాళికతో వారిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అమృత్‌పాల్ సింగ్‌ అనుచరుల్ని గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకెళ్లి విచారిస్తున్నారు. అమృత్‌పాల్ సింగ్‌, అతడి అనుచరుల్ని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. దాదాపు 50 పోలీసు వాహనాలు వీళ్లను అనుసరించి అరెస్ట్ చేశారు. అమృత్‌పాల్ సింగ్‌ అరెస్ట్ నేపథ్యంలో నాలుగు జిల్లాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. కేంద్ర హోం శాఖ ఎప్పటికప్పుడు ఇక్కడి పరిస్థితిని సమీక్షిస్తోంది. పంజాబ్‌లోని తాజా పరిస్థితిపై రాష్ట్ర సెక్రటరీ కేంద్రానికి నివేదిక పంపారు. ఖలిస్తాన్ మద్దతుదారు అయిన అమృత్‌పాల్ సింగ్‌ గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. పంజాబ్ ప్రభుత్వాన్ని, భారత దేశాన్ని సవాల్ చేస్తూ హెచ్చరికలు జారీ చేశాడు. పంజాబ్ ఏదో ఒక రోజు స్వతంత్రం అవుతుందని, ఖలిస్తాని భావజాలం ఎప్పటికీ చావదని అతడు వ్యాఖ్యానించాడు. గతంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా కూడా కొన్ని వ్యాఖ్యలు చేశాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)