ప్రజాస్వామ్య సంస్థల విజయం కొందరిలో అసూయను కలిగిస్తోంది !

Telugu Lo Computer
0


ఇండియా టుడే కాన్క్లేవ్ 2023లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శనివారం కీలకోపన్యాసం చేస్తూ భారత ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్య సంస్థల విజయం కొందరిలో అసూయను కలిగిస్తోందని అన్నారు. ఈ విజయం వల్లే మన ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్య సంస్థలపై దాడులు జరుగుతున్నాయని ప్రధాని మోదీ అన్నారు. ప్రజాస్వామ్య ఫలాలు అంటే ఏంటో యావత్ ప్రపంచానికి భారత్ చూపించిందన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం దాడికి గురవుతోందంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలకు ప్రధాని మోడీ కౌంటర్ ఇచ్చారు. అవినీతి ఆరోపణలపై విచారణ జరుపుతున్న సంస్థల చుట్టూ వివిధ పార్టీల నేతలు ర్యాలీలు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. "ఏ దేశ అభివృద్ధిలోనైనా, విధాన రూపకల్పనలోనైనా స్తబ్దత అతి పెద్ద అడ్డంకులలో ఒకటి. మన దేశంలో, పాత ఆలోచనలు, పాత విధానాల కారణంగా, కొన్ని కుటుంబాల పరిమితుల కారణంగా, చాలా కాలం స్తబ్దత ఉంది, " అని ప్రధాని మోడీ అన్నారు. "మనం ముందుకు వెళ్లాలంటే, నిర్ణయాలు తీసుకునే వేగం, ధైర్యం ఉండాలి. దేశం ఎదగాలంటే, కొత్తదనాన్ని స్వీకరించే సామర్థ్యం ఉండాలి.” అని అన్నారు. భారత దేశ ప్రజాస్వామ్య సంస్థల పటిష్టత గురించి ప్రధాని మోడీ ప్రసంగించారు. గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో సృష్టించబడిన అనేక కొత్త సంస్థలను జాబితా చేశారు. "ఈ రోజు భారత దేశం ఏదైతే సాధిస్తోందో, అది మన ప్రజాస్వామ్య శక్తి, మన సంస్థల శక్తి వల్లనే" అని ప్రధాని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన భారత ప్రభుత్వం నిర్ణయాత్మక నిర్ణయాలు తీసుకుంటోందని ప్రపంచం చూస్తోందన్నారు. గత సంవత్సరాల్లో భారత దేశంలో సృష్టించబడిన కొత్త సంస్థలను ప్రధాన మంత్రి హైలైట్ చేశారు. భవిష్యత్ రోడ్‌మ్యాప్‌ను నిర్ణయించడంలో నీతి ఆయోగ్ పెద్ద పాత్ర పోషిస్తుందని, దేశంలో కార్పొరేట్ పాలనను బలోపేతం చేయడంలో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని, భారతదేశంలో ఆధునిక పన్ను వ్యవస్థను రూపొందించడంలో జీఎస్‌టీ కౌన్సిల్ పాత్రను కూడా ప్రధాని స్పృశించారు. కరోనా సమయంలోనూ ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు భాగమయ్యారని ప్రధాని స్పష్టం చేశారు. దేశంలోని ప్రజాస్వామ్య సంస్థలు బలంగా ఉన్నాయని, అందుకే ఎన్నికల్లో ప్రజల భాగస్వామ్యం పెరుగుతోందని ప్రధాని అన్నారు. బలమైన ఆర్థిక, బ్యాంకింగ్ వ్యవస్థలు ఉన్నాయని  ఈ విజయాలు కొందరిని బాధిస్తున్నాయని మోడీ అన్నారు. అందుకే మన ప్రజాస్వామ్యాన్ని, సంస్థలను లక్ష్యంగా చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచంలోని మేధావులంతా భారత దేశ వృద్ధి రేటు గురించి ఆశాజనకంగా ఉన్నారన్నారు. కానీ, దేశ స్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు సైతం జరుగుతున్నాయని, ఏదైనా మంచి పని జరుగుతుంటే కాటుక పెట్టుకోవడం మన సంప్రదాయమని ఎద్దేవా చేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)