తెలంగాణ ఎమ్మెల్సీ కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురువారం మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 20వ తేదీన వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని పేర్కొంది. దర్యాప్తులో భాగంగా కవిత నేడు ఈడి హాజరుకావాల్సి ఉండగా.. తాను హాజరుకాలేనని అధికారులకు ఈ-మెయిల్ ద్వారా సమాచారం పంపిన సంగతి తెలిసిందే. మరో రోజు విచారణకు హాజరయ్యేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు పేర్కొన్నారు. దీంతో 20 వ తేదీన విచారణకు హాజరుకావాలని ఈడి నోటీసులిచ్చింది. ఈ నెల 16వ తేదీన ఈడీ విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులు జారీ చేయడంపై కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఒక మహిళను విచారించేందుకు ఈడీ కార్యాలయానికి పిలవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. తమకు ఇచ్చిన నోటీసుల్లో ఇతరులతో కలిపి విచారిస్తామని చెప్పారని.. కానీ అలా చేయలేదని కవిత పేర్కొన్నారు. పిటిషన్ను విచారణకు తీసుకుంటున్నట్లు చీఫ్ జస్టిస్ డివైచంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. ఆమె పిటిషన్పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు, తక్షణమే విచారించేందుకు నిరాకరించిన ధర్మాసనం.. ఈనెల 24న వాదనలు వింటామని స్పష్టం చేసింది. దీంతో సుప్రీం తీర్పునకు ముందే మరోసారి వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని కవితకు ఈడి నోటీసులు జారీ చేయడం గమనార్హం. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న అరుణ్ పిళ్లై కస్టడీ ముగియడంతో ఈడి అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరికొందరితో కలిపి పిళ్లైని ప్రశ్నించాల్సి ఉందని ఈడి కోర్టుకు తెలిపింది. ఈడి వాదనలు విన్న సిబిఐ ప్రత్యేక కోర్టు.. మరో మూడు రోజుల పాటు పిళ్లై కస్టడీ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
కవితకు మరోసారి ఈడీ నోటీసులు
March 16, 2023
0
Tags