48 గంటల్లో రిపోర్ట్ కావాలంటూ గవర్నర్ ఆదేశం

Telugu Lo Computer
0


తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం మలుపులు తిరుగుతోంది. టౌన్‌ ప్లానింగ్‌ ప్రశ్నాపత్రం లీకేజీతో మొదలైన ప్రవీణ్‌ కుమార్ బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తోన్నాయి. ఇప్పటికే అసిస్టెంట్ ఇంజినీర్ పరీక్ష పేపర్ లీక్ అయింది. తాజాగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ కూడా లీక్ అయినట్లు అనుమానాలు వ్యక్తమౌతోన్నాయి. ఈ ఉదంతం అభ్యర్థులను తీవ్ర ఆందోళనలోకి నెట్టింది. ఈ కేసులో తొమ్మిదిమందిని పోలీసులు ఇదివరకే అరెస్టు చేశారు. వారిని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించింది న్యాయస్థానం. అనంతరం వారిని చంచల్ గూడ కేంద్ర కారాగారానికి తరలించారు. ఈ కేసును ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ కు బదలాయించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రవీణ్ కుమార్ ను అధికారులు సస్పెండ్ చేశారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రాజశేఖర్ రెడ్డిని ఉద్యోగం నుంచి తొలగించారు. షెడ్యూల్ ప్రకారం.. టౌన్ ప్లానింగ్ పరీక్షతో పాటు బుధవారం జరగాల్సిన వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ పరీక్ష పేపర్‌ లీక్ కావడం కలకలం రేపుతోంది. ప్రవీణ్ కుమార్ నుంచి ప్రశ్నాపత్రాన్ని కొనుగోలుచేసినట్లు అనుమానిస్తోన్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో నలుగురు అభ్యర్థులను కూడా విచారణ చేస్తున్నారు. ఈ లీకేజీలో ప్రవీణ్ కుమార్ పాత్ర కీలకంగా భావిస్తోన్నారు అధికారులు. అతనితోపాటు టీఎస్‌పీఎస్సీ ఉద్యోగులు కూడా ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమౌతోన్నాయి. పేపర్ లీక్ ఉదంతం తెలంగాణలో ప్రకంపనలు రేపింది. ప్రభుత్వం ఘోర వైఫల్యం వల్లే పేపర్ లీక్ అయిందంటూ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. నాంపల్లిలోని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయాన్ని విద్యార్థి సంఘాల నాయకులు, ప్రతినిధులు పెద్ద ఎత్తున ముట్టడించారు. గేటును దాటి లోనికి ప్రవేశించడానికి ప్రయత్నించారు. టీఎస్‌పీఎస్సీ అభ్యర్థులు, బహుజన్ సమాజ్ వాది పార్టీ నాయకులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు ముట్టడించారు. పేపర్ లీకేజీ బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జోక్యం చేసుకున్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శికి లేఖ రాశారు. పేపర్ లీకేజీపై 48 గంటల్లోగా వివరణాత్మకమై సమగ్ర నివేదికను తనకు అందజేయాలని ఆదేశించారు. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. లక్షలాదిమంది అభ్యర్థుల భవిష్యత్తుతో ఆధారపడి ఉన్నందున భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని సూచించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)