ఇంగ్లండ్‌ పై పోరాడి ఓడిన భారత్‌

Telugu Lo Computer
0


మహిళల టి20 ప్రపంచకప్‌లో భారత జోరుకు ఇంగ్లండ్‌ బ్రేకులేసింది. గ్రూప్‌-2లో శనివారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్‌ సేన 11 పరుగుల తేడాతో ఓడింది. ఇంగ్లండ్‌ ఈ మెగా టోర్నీలో 'హ్యాట్రిక్‌' విజయాలతో సెమీస్‌ బెర్త్‌ను దాదాపు ఖాయం చేసుకుంది. ముందుగా ఇంగ్లండ్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 151 పరుగులు చేసింది. రేణుకా సింగ్‌ (4-0-15-5) అద్భుతమైన బౌలింగ్‌తో టాపార్డర్‌ బ్యాటర్లు సోఫియా (10), వ్యాట్‌ (0), అలైస్‌ క్యాప్సీ (2)లను బెంబేలెత్తించింది. సీవర్‌ బ్రంట్‌ (42 బంతుల్లో 50; 5 ఫోర్లు), ఆఖర్లో అమీ జోన్స్‌ (27 బంతుల్లో 40; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో ఇంగ్లండ్‌ పోరాడే లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం భారత్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 140 పరుగులే చేసింది. ఆరంభంలో ఓపెనర్‌ స్మృతి మంధాన (41 బంతుల్లో 52; 7 ఫోర్లు, 1 సిక్స్‌), ఆఖరిదాకా రిచా ఘోష్‌ (34 బంతుల్లో 47 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) పోరాడారు. కానీ మిగతా బ్యాటర్లు షఫాలీ (8), జెమీమా (13), హర్మన్‌ప్రీత్‌ (4), దీప్తి శర్మ (7)ల వైఫల్యంతో జట్టు ఓడింది. ఈరోజు జరిగే మచ్ లో  వెస్టిండీస్‌ చేతిలో పాకిస్తాన్‌ ఓడిపోయి, రేపు ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై గెలిస్తేనే భారత్‌ ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా సెమీస్‌ చేరుతుంది. వెస్టిండీస్, ఇంగ్లండ్‌ జట్లపై పాక్‌ గెలిచి... ఐర్లాండ్‌ను భారత్‌ కూడా ఓడిస్తే... భారత్, ఇంగ్లండ్, పాక్‌ ఆరు పాయింట్లతో సమఉజ్జీగా నిలుస్తాయి. మెరుగైన రన్‌రేట్‌ ఉన్న రెండు జట్లు సెమీస్‌ చేరుకుంటాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)