బ్రిటన్ లో ముసురుకుంటున్న మాంద్యం

Telugu Lo Computer
0


బ్రిటన్‌ ఆర్థిక వ్యవస్థ రోజు రోజుకి దిగజారిపోతోంది.పెరిగిన ధరలు ప్రజల జేబుల్ని గుల్ల చేస్తున్నాయి. పెరుగుతున్న ధరలకి తగ్గట్టుగా ఆదాయాలు పెరగకపోవడంతో ప్రజలకి కొనుక్కొని తినే స్థోమత కూడా కరువు అవుతోంది. దీంతో సమాజంలోని వివిధ వర్గాలు వేతనాల పెంపు డిమాండ్‌తో సమ్మెకు దిగుతున్నాయి. ప్రపంచంలోని మిగిలిన అభివృద్ధి చెందిన దేశాలు ఈ ఏడాది ఆర్థికంగా పుంజుకుంటే బ్రిటన్‌ మరింత క్షీణిస్తుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి అంచనా వేస్తోంది. ఆర్థిక మాంద్యం తప్పదని బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రతో చమురు లభ్యత చాలా దేశాలకు అతి పెద్ద సమస్యగా మారింది. అమెరికా తన సొంత గడ్డపై లభించే శిలాజ ఇంధనాలపై ఆధారపడితే, ఫ్రాన్స్‌ అణు విద్యుత్‌పైనా, నార్వే జలవిద్యుత్‌పైన ఆధారపడ్డాయి. యూకే గ్యాస్‌పైనే ఆధారపడే దేశం కావడంతో విద్యుత్‌ బిల్లులు తడిసిపోపెడైపోయాయి. ఒకానొక దశలో వంద శాతం పెరిగాయి. దేశం ఆర్థికంగా కుదేలు కావడానికి ఇంధనం అసలు సిసలు కారణమని ఫిస్కల్‌ స్టడీస్‌ ఇనిస్టిట్యూట్‌ డిప్యూటీ డైరెక్టర్‌ కార్ల్‌ ఎమ్మర్‌సన్‌ అభిప్రాయపడ్డారు. అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్‌ వంటి సంపన్న దేశాల కంటే బ్రిటన్‌ ఎందుకు వెనుకబడిందనే చర్చ జరుగుతోంది. కరోనా మహమ్మారి, ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర ప్రపంచ ఆర్థిక వ్యవస్థలనే ఛిన్నాభిన్నం చేశాయి. కరోనా విసిరిన సవాళ్ల నుంచి కోలుకునే దశలో ఉక్రెయిన్‌పై రష్యా ప్రారంభించిన యుద్ధం పులి మీద పుట్రలా మారింది. అన్నింటిని తట్టుకొని ధనిక దేశాలు మళ్లీ పూర్వ స్థితికి వస్తూ ఉంటే బ్రిటన్‌ మాత్రం కోలుకోలేకపోతోంది. రాజకీయాలు, వాతావరణ పరిస్థితులు వంటివి కూడా ప్రభావం చూపిస్తాయి. ఇతర దేశాలు విద్య, ఆరోగ్య రంగం ఆధారంగా పరిస్థితుల్ని అంచనా వేస్తే బ్రిటన్‌ మాత్రం సేవల ఆధారంగా నిర్ణయిస్తుంది. జీ-7 దేశాలన్నీ ఈ ఏడాది కోలుకుంటాయని ఐఎంఎఫ్‌ వంటి సంస్థలు అంచనా వేస్తున్నాయి. కానీ బ్రిటన్‌ పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)