కల్యాణమస్తు, షాదీ తోఫా లబ్ధిదారుల ఖాతాల్లో సొమ్ము జమ

Telugu Lo Computer
0


ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లో ఆడబిడ్డల పెళ్లిళ్లు పేదలైన తల్లిదండ్రులకు భారం కాకూడదన్న లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్‌  ప్రభుత్వం అందిస్తున్న 'వైఎస్సార్‌ కల్యాణమస్తు', 'వైఎస్సార్‌ షాదీ తోఫా' పథకాల ఆర్థిక సాయాన్ని ఈరోజు లబ్ధిదారులకు అందించారు. తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయం నుంచి అర్హులైన 4,536 మంది లబ్ధిదారులకు రూ.38.18 కోట్ల ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి మీట నొక్కి వారి ఖాతాల్లో జమ చేశారు. గతేడాది అక్టోబరు 1 నుంచి డిసెంబరు 31 మధ్య వివాహాలు చేసుకుని, అర్హత ఉన్న వివిధ వర్గాలకు చెందిన యువతులకు ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. అక్టోబర్‌ - డిసెంబర్‌ 2022 త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 4,536 మంది లబ్ధిదారులకు వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా కింద ఆర్ధిక సాయాన్ని వారి ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ అక్టోబరు-డిసెంబర్‌ మధ్య పెళ్లిళ్లు చేసుకున్నవారికి దరఖాస్తు చేసుకోవడానికి ఒక నెలపాటు సమయం ఇచ్చామని.. ఫిబ్రవరిలో వెరిఫికేషన్‌ పూర్తిచేసి ఈరోజు నేరుగా వారికి నగదు జమచేస్తున్నాం అన్నారు.. సమాజంలో మార్పు తీసుకువచ్చే దిశగా పథకం అమలుచేస్తున్నాం. ప్రతి సంవత్సరంలో ప్రతీ త్రైమాసికానికి సంబంధించి ఇదే పద్ధతిలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తాం. గొప్ప చదువులతోనే పేదల రాతలు మారుతాయి. ఖర్చుకు వెనుకాడకుండా నిధులు ఖర్చు చేస్తున్నాము. పేదింటి ఆడబిడ్డలను చదువులో ప్రోత్సహించడం, బాల్య వివాహాలను అరికట్టడానికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. మరోవైపు.. డ్రాపౌట్‌ రేటు తగ్గించడమే లక్ష్యంగా పథకం అమలు అవుతోంది. ఈ పథకం పొందాలంటే వధూవరులకు 10వ తరగతి ఉత్తీర్ణత తప్పనసరి చేశామని.. నా చెల్లెమ్మలకు 18 ఏళ్లు, నా తమ్ములకు 21 ఏళ్లుగా నిర్దేశించినట్టు ఈ సందర్భంగా మరోసారి గుర్తుచేశారు.. పెళ్లిళ్ల కోసం కొంతకాలం ఆగొచ్చు కానీ చదువులు ఆగిపోకూడదు. అమ్మాయిలు చదువుల బాట పడితేనే సమాజం బాగుపడుతుంది. పదేళ్ల తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి? అన్న ఆలోచనతో మనం అడుగులు ముందుకేస్తున్నామని వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి  వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)