శ్రీ సాయిట్రావెల్స్కు చెందిన బస్సు శంషాబాద్ నుంచి మేడ్చల్ వెళుతోంది. ఆదివారం రాత్రి 8.10 గంటల సమయంలో వైఎంసీఏ కూడలి వద్ద రెడ్ సిగ్నల్ పడటంతో వాహనదారులు అందరూ ఆగి ఉన్నారు. మేడ్చల్ తిమ్మాపురంవాసి బి.మహేష్ మితిమీరిన వేగంతో బస్సు నడుపుతూ వచ్చి ఆగి ఉన్న వాహనాలను ఢీకొట్టుకుంటూ కొంతదూరం వెళ్లాడు. తూంకుంట పురపాలక సింగాయిపల్లికి చెందిన కొత్తపల్లి సందీప్ గౌడ్ (35) బస్సు కిందపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ద్విచక్రవాహనాలపై ఉన్న మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఇద్దరిని గాంధీకి తరలించగా, సురారంకాలనీకి చెందిన వినయ్ను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదుచేసిన పోలీసులు బస్సు డ్రైవర్ మహేష్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో మూడు కార్లు, నాలుగు ద్విచక్రవాహనాలు ధ్వంసమయ్యాయి. బస్సు బ్రేకులు ఫెయిల్ అయ్యాయని డ్రైవర్ చెబుతున్నాడు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడున్న వాహనదారులు డ్రైవర్ను పట్టుకుని చితకబాదారు. ప్రమాదంలో మృతిచెందిన సందీప్గౌడ్కు ఏడాది క్రితమే వివాహం జరిగింది. దిల్సుఖ్నగర్ ప్రాంతంలో పుట్టింట్లో ఉన్న భార్యను ఆదివారం సాయంత్రం తీసుకొని వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సు వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో చెరోవైపు పడిపోయారు. సందీప్ పైనుంచి బస్సు వెళ్లడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తన కళ్లెదుటే భర్త ప్రాణాలు కోల్పోవడంతో ఆమె కన్నీరుమున్నీరు విలపించిన తీరు అందరిని కలిచివేసింది.
భార్య కళ్లెదుటే భర్త మృతి !
February 27, 2023
0
Tags