ఇద్దరు యువకులు కారులో సజీవ దహనం

Telugu Lo Computer
0


రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌ జిల్లాకు చెందిన నసీర్‌ (25), జునైద్‌ (35) ఇద్దరిని బజరంగ్‌ దళ్‌ సభ్యులు ఐదుగురు వారిని బుధవారం కిడ్నాప్‌ చేశారు. కిడ్నాప్‌ అయిన యువకులు హర్యానాలోని భివానీ జిల్లాలో ఓ నిర్మానుష్య ప్రాంతంలో మహీంద్ర బోలెరో ఎస్‌యువి వాహనంలో సజీవదహనమమై కనిపించారు. ముస్లిం యువకుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు భరత్‌పూర్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గురువారం ఉదయం హర్యానాలో బోలెరో వాహనంలో సజీవ దహనమైన మృతదేహాలు నసీర్‌, జునైద్‌లవేనని పోలీసులు అనుమానించారు. యువకుల మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా ఆ మృతదేహాలు ముస్లిం యువకులవా లేదా అన్న విషయాన్ని తెలియజేస్తామని భరత్‌పూర్‌ ఐజి గౌరవ్‌ శ్రీవాస్తవ మీడియాకు వెల్లడించారు. ఈ ఇద్దరు యువకులు కారుకి నిప్పంటించడం వల్ల సజీవదహనమయ్యారా? లేక కారులో మంటలు చెలరేగి చనిపోయారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని ఐజి పేర్కొన్నారు. ఆవుల అక్రమ రవాణాకు సంబంధించి జునైద్‌పై ఐదు కేసులు నమోదయ్యాయని, నసీర్‌కు ఎలాంటి నేర చరిత్ర లేదని శ్రీవాస్తవ తెలిపారు. కాగా, ముస్లిం యువకులను కిడ్నాప్‌ చేసిన ఐదుగురు వ్యక్తులు మోను మనేసర్‌, లోకేష్‌ సింఘియా, రింకు సైనీ, అనిల్‌, శ్రీకాంత్‌లు. ఈ ఐదుగురు గోసంరక్షకులమని తమతో చెప్పారని పోలీసులు పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)