ప్రీతి కుటుంబానికి రూ.30 లక్షల పరిహారం !

Telugu Lo Computer
0


ఆత్మహత్యాయత్నం చేసిన పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఐదురోజుల పాటు మృత్యువుతో పోరాడి నిమ్స్‌ ఆసుపత్రిలో మృతి చెందింది. దీంతో నిమ్స్‌ ఆసుపత్రిలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ప్రీతి మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం నిమ్స్‌ నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించేందుకు అధికారులు యత్నించగా ఆమె తల్లిదండ్రులు తొలుత నిరాకరించారు. ప్రీతి మృతి చెందడానికి గల కారణాలు తెలపాలని డిమాండ్‌ చేశారు. ప్రీతికి ఇంజక్షన్‌ ఇచ్చారని ఆరోపించారు. ఈ నెల 22 ఉదయం 4 గంటల నుంచి 8 గంటల వరకు ఏం జరిగిందో చెప్పాలని పట్టుబట్టారు. సీనియర్‌ విద్యార్థిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు ప్రీతి తల్లిదండ్రులతో పోలీసులు మాట్లాడారు. దీంతో ప్రీతి మృతదేహాన్ని శవపరీక్షకు తరలించేందుకు వారు ఒప్పుకోవడంతో గాంధీకి తరలించారు. అయితే గాంధీ ఆసుపత్రిలోకి వెళ్లకుండా ప్రీతి బంధువులను పోలీసులు అడ్డుకున్నారు. శవపరీక్షకు తమను అనుమతించాలని వారు డిమాండ్‌ చేశారు. శవపరీక్ష పూర్తి అయిన అనంతరం పోలీసు భద్రత మధ్య కుటుంబ సభ్యులకు ప్రీతి మృతదేహాన్ని అప్పగించారు. అనంతరం ప్రీతి మృతదేహాన్ని స్వస్థలం జనగామ జిల్లా కొడకండ్ల మండలం గిర్ని తండాకు తరలించారు. ప్రీతి కుటుంబానికి రూ.30 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. ప్రభుత్వం రూ.10 లక్షలు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు రూ.20 లక్షలు పరిహారం ప్రకటించినట్లు ప్రీతి తండ్రి తెలిపారు. కుటుంబంలో ఒకరికి గెజిటెడ్‌ ఉద్యోగం ఇవ్వనున్నట్లు మంత్రి హామీ ఇచ్చారన్నారు. పంచాయతీరాజ్‌ శాఖలో ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని, అంతేకాకుండా సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేపిస్తానని మంత్రి చెప్పినట్లు ప్రీతి తండ్రి పేర్కొన్నారు. హెచ్‌వోడీ, ప్రిన్సిపల్‌పై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. అంతకుముందు ప్రీతి మృతి వార్త తెలియడంతో విద్యార్థి సంఘాల నేతలు, భాజపా కార్యకర్తలు నిమ్స్‌ ఆసుపత్రికి భారీగా చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు ప్రీతి మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అంబులెన్స్‌లో మృతదేహాన్ని తరలించేందుకు యత్నిస్తుండగా ప్రీతి బంధువులు, గిరిజనులు, ఎస్టీ సంఘాలు, భాజపా కార్యకర్తలు వాహనం ముందు బైఠాయించారు. ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ నిరసనకు దిగారు. ప్రీతి మృతదేహాన్ని ప్రగతిభవన్‌కు తీసుకెళ్తామని ఆమె బంధువులు తెలిపారు. ప్రీతి మృతికి కారకులను కఠినంగా శిక్షించాలన్నారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌ను తరలించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)