ఢిల్లీలో జరిగిన నిక్కీ యాదవ్ హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటి వరకు నిక్కీ, సాహిల్ ఇద్దరూ సహజీవనం చేస్తున్నట్లు భావించిన పోలీసులు సాహిల్ను విచారించగా కీలక విషయాలు బయటకు వచ్చినట్లు తెలిపారు. వారిద్దరికీ 2020లోనే పెళ్లి జరిగిందని తెలిపారు. ఈ పెళ్లి సాహిల్ ఇంట్లో వాళ్లకు ఇష్టంలేదని, సాహిల్కు మరో యువతితో పెళ్లి నిశ్చయం చేశారని వివరించారు. ఈ పెళ్లి చేసుకోవడానికి సాహిల్ కూడా ఒప్పుకున్నాడని చెప్పారు. మరో యువతితో సాహిల్కు నిశ్చితార్థం కూడా జరిగిందని తెలిసి నిక్కీ యాదవ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. తనను పెళ్లి చేసుకుని కాపురం చేస్తూ మరో యువతితో పెళ్లికి ఎలా సిద్ధపడ్డావంటూ నిక్కీ నిలదీయడంతో ఆమెను అడ్డుతొలగించుకోవాలని నిర్ణయించుకున్నట్లు సాహిల్ విచారణలో చెప్పాడు. ఈ నెల 10న పథకం ప్రకారమే నిక్కీని చంపేశానని, మృతదేహాన్ని తన దాబాలోని ఫ్రిజ్లో దాచినట్లు తెలిపారు. అదేరోజు తన తండ్రికి, ఇద్దరు సోదరులతో పాటు మరో ఇద్దరు స్నేహితులకు హత్య విషయం చెప్పానని వెల్లడించాడు. ఆ తర్వాతే అంతా కలిసి వివాహ వేదికకు వెళ్లామని తెలిపాడు. విచారణలో సాహిల్ చెప్పిన వివరాల ఆధారంగా ఈ హత్యలో సాహిల్తో పాటు అతడి కుటుంబ సభ్యులు, స్నేహితుల పాత్ర కూడా ఉందని విచారణలో భాగంగా పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో నిందితుడి తండ్రి వీరేంద్ర సింగ్, సోదరులు, స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు.
నిక్కీ, సాహిల్ లకు 2020లోనే పెళ్లి జరిగింది !
February 18, 2023
0
Tags