తమిళనాడు సంప్రదాయ క్రీడ జల్లికట్టులో హింస ఉంటుందని, అంత మాత్రానా దాన్ని నెత్తుటి క్రీడ అనలేమని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. ఈ క్రీడలో రక్తం చిందడం యాదృచ్ఛికం మాత్రమేనన్న ధర్మాసనం, నెత్తురు కళ్ల చూడాలన్న ఉద్దేశంతో ఆ కార్యక్రమంలో ఎవరూ పాల్గొనరని తెలిపింది. జస్టిస్ కె.ఎం.జోసెఫ్ నేతృత్వంలో జస్టిస్ అజయ్ రస్తోగీ, జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ సి.టి.రవికుమార్లతో కూడిన ధర్మాసనం 'జల్లికట్టు'పై దాఖలైన పిటిషన్లను విచారిస్తోంది. జల్లికట్టుకు అనుమతిస్తూ 2017లో ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాల్టీ టు యానిమల్స్ చట్టానికి తమిళనాడు సవరణ చేయడాన్ని సవాలు చేస్తూ పలువురు సుప్రీంను ఆశ్రయించారు. పిటిషన్ల విచారణ సందర్భంగా పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్.. జల్లికట్టును నెత్తుటి క్రీడగా అభివర్ణించారు. అయితే ఈ వ్యాఖ్యలను ధర్మాసనం తప్పుబట్టింది. జల్లికట్టులో పాల్గొనే వారు ఎవరూ ఆయుధం వాడరుకదా. అందులో హింస ఉండొచ్చు కానీ.. దాన్ని నెత్తుటి క్రీడ అనలేమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. తీర్పును రిజర్వులో ఉంచుతున్నట్లు సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం ప్రకటించింది.
జల్లికట్టును నెత్తుటి క్రీడ అనలేం !
December 09, 2022
0
Tags