అంబానీ, అదానీ సంపద కరిగిపోయింది !

Telugu Lo Computer
0


గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పతనమవ్వడంతో దేశంలో అత్యంత సంపన్నులైన గౌతమ్ అదానీ, ముకేష్ అంబానీ, శివ్ నాడార్ సంపద గత వారం భారీగా తగ్గిపోయింది. ఈ నెల 19 నుంచి 23 వరకు స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయాయి. శుక్రవారం రోజు స్టాక్ మార్కెట్లో దాదాపు రూ.8.40 లక్షల సంపద తగ్గిపోయింది. గురువారం బీఎస్ఈ స్టాక్ మార్కెట్లో మొత్తం లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ.280.53 లక్షల కోట్లుకాగా, శుక్రవారం జరిగిన నష్టంతో ఈ విలువ రూ.272.12 లక్షల కోట్లకు పడిపోయింది. బీఎస్ఈ సెన్సెక్స్ శుక్రవారం 980 పాయింట్లు పతనమై, 59,845 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 320 పాయింట్లు నష్టపోయి 17,806 వద్ద ముగిసింది. మార్కెట్లు నష్టాలు చవిచూడటంతో అదానీ, అంబానీ సంపద కూడా తగ్గిపోయింది. బ్లూమ్‌బర్గ్ సంస్థ జాబితాలో టాప్-10లో ఉన్న వీళ్లిద్దరితోపాటు, టాప్-50లో ఉన్న మరో వ్యాపారవేత్త శివ నాడార్ కూడా నష్టాలపాలయ్యారు. శనివారం గౌతమ్ అదానీ తన సంపదలో 9.38 బిలియన్ డాలర్లు కోల్పోయారు. ప్రస్తుతం ఆయన సంపద 110 బిలియన్ డాలర్లుగా ఉంది. అంతకుముందు బ్లూమ్‌బర్గ్ సంస్థ జాబితాలో మూడో స్థానంలో ఉన్న అదానీ, ఈ ఏడాది రెండో స్థానానికి చేరుకున్నారు. తాజా పతనం నేపథ్యంలో తిరిగి మూడో స్థానానికి పడిపోయారు. ఈ జాబితాలో తొమ్మిదో స్థానంలో నిలిచిన ముకేష్ అంబానీ సంపద కూడా భారీగా తగ్గింది. స్టాక్ మార్కెట్ నష్టాల కారణంగా ఆయన సంపద 2.71 బిలియన్ డాలర్లు తగ్గి, 85.4 బిలియన్ డాలర్లకు చేరింది. ఈ ఏడాది గౌతమ్ అదానీ సంపద పెరిగితే, ముకేష్ అంబానీ సంపద 4.55 బిలియన్ డాలర్లు తగ్గింది. దేశంలోని కుబేరుల్లో ఒకరైన హెచ్‌సీఎల్ సంస్థ అధినేత శివ్ నాడార్ సంపద కూడా తగ్గిపోయింది. ఈ ఏడాదిలో ఆయన సంపద 8.20 బిలియన్ డాలర్లు తగ్గి, 24.4 బిలియన్ డాలర్లకు చేరింది.

Post a Comment

0Comments

Post a Comment (0)