మధ్యప్రదేశ్లోని ఇండోర్ పట్టణంలో ఉన్న మహాత్మా గాంధీ మెమోరియల్ మెడికల్ కాలేజీలో చాలా కాలం నుంచి ర్యాగింగ్ జరుగుతోంది. ఈ విషయంపై పోలీసులకు పలు ఫిర్యాదులు అండాయి. అయితే, ఎవరూ నిందితుల పేర్లు చెప్పేందుకు ఇష్టపడలేదు. ర్యాగింగ్ చాలా భయంకరంగా ఉన్నప్పటికీ బాధిత విద్యార్థులు పూర్తి వివరాలు చెప్పేందుకు నిరాకరించారు. పోలీసులు వెళ్లి వారికి ధైర్యం చెప్పినప్పటికీ ఎవరూ ముందుకు రాలేదు. హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేసినా స్పందించలేదు. దీంతో ర్యాగింగ్ అంశం పోలీసులకు ఒక సవాలుగా మారింది. ఎలాగైనా ఈ కేసులో నిందితుల్ని పట్టుకోవాలి అనుకున్నారు. ఇందు కోసం చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమవ్వడంతో చివరకు అండర్ కవర్ ఆపరేషన్కు శ్రీకారం చుట్టారు. షాలిని చౌహాన్ అనే 24 ఏళ్ల కానిస్టేబుల్ను క్యాంపస్కు, కాలేజీకి స్టూడెంట్గా పంపించాలని ఇన్స్పెక్టర్ సహా ఉన్నతాధికారులు నిర్ణయించారు. దీనికి షాలిని కూడా అంగీకరించింది. అంతే.. ఆ రోజు నుంచి కాలేజీలో చేరింది. తర్వాత నుంచి రోజూ విద్యార్థిలాగే ఉంటూ వచ్చింది. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా తను స్టూడెంట్ అని నమ్మించింది. అందరు స్టూడెంట్స్కు దగ్గరైంది. ఆమె నిజంగానే విద్యార్థి అని నమ్మిన మిగతా స్టూడెంట్స్ తనతో అన్ని వివరాలు షేర్ చేసుకోవడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో నిందితుల గురించి పూర్తి ఆధారాలు షాలిని సేకరించింది. ఆ ఆధారాలతో నిందితుల్ని కాలేజీ నుంచి సస్పెండ్ అయ్యేలా చేసింది. అలా షాలిని మొత్తం మూడు నెలలపాటు విద్యార్థిగా నమ్మించింది. ర్యాగింగ్ నిందితుల్ని చాకచక్యంగా పట్టుకుంది. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు ఆమెను అభినందించారు. ఆమె విద్యార్థిలా, తక్కువ వయసున్నట్లు కనిపించడం కూడా ఆమెకు ప్లస్ అయింది. కాగా, తాను ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్తగా ఉన్నానని, ఇది తనకో మంచి అనుభవమని షాలిని చెప్పింది.
మెడికల్ కాలేజీలో అండర్ కవర్ ఆపరేషన్ !
December 12, 2022
0
Tags