కల్తీ మద్యం తాగి మరణించిన వారి సంఖ్య 50కి పెరుగుదల

Telugu Lo Computer
0


బీహార్‌లోని ఛప్రాతో సహా పలు జిల్లాల్లో కల్తీ మద్యం తాగి మరణించిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. శుక్రవారం నాటికి 50 మంది మరణించినట్లు తెలుస్తోంది. నకిలీ మద్యం కేసు కారణంగా ఛప్రాలో ఎస్‌హెచ్ఓ రిత్రేష్ మిశ్రా, కానిస్టేబుల్ వికేష్ తివారీలను గురువారం సస్పెండ్ చేశారు. నకిలీ మద్యం విషయంలో అసెంబ్లీలో  మాటల యుద్ధం సాగుతుంది.  నకిలీ మద్యం సేవించి పదుల సంఖ్యలో మరణిస్తే ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నితీష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని అసెంబ్లీలో బీజేపీ సభ్యులు డిమాండ్ చేశారు. ఈక్రమంలో రెండురోజుల క్రితం తీవ్ర ఆగ్రహానికిలోనైన సీఎం నితీష్ కుమార్ బీజేపీ సభ్యులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సభకు తాగివచ్చారా? అంటూ అనడంతో నితీష్ తీరును నిరసిస్తూ బీజేపీ సభ్యులు అసెంబ్లీని వాకౌట్ చేశారు. శుక్రవారం సైతం అసెంబ్లీలో గందరగోళ పరిస్థితి నెలకొంది. నితీష్ కుమార్ ప్రభుత్వం నకిలీ మద్యం సేవించి మరణించిన వారి మృతదేహాలను పోస్టుమార్టం చేయకుండానే తగులబెట్టి మరణాలను తక్కువ చూపిస్తుందని బీజేపీ సభ్యులు సభలో ఆరోపించారు. ఈ క్రమంలో మరోసారి అధికార, విపక్ష పార్టీల సభ్యుల వాగ్వివాదం చోటు చేసుకుంది. శుక్రవారం నితీష్ కుమార్ కల్తీ మద్యం సేవించి మరణించిన వారి వివరాలను వెల్లడించారు. కల్తీ మద్యం తాగిన కారణంగా ఛప్రా, సివాన్, బెగుసరాయ్ లో 51 మంది మరణించారని నితీష్ తెలిపారు. బీహార్ రాష్ట్రంలో మద్యం తాగి ఎవరైనా చనిపోతే ప్రభుత్వం పరిహారం ఇవ్వదని నితీశ్ అన్నారు. మద్యం సేవించి, అతిగా మద్యం సేవిస్తే చనిపోతారని అందరికీ తెలుసని, అయినా అలా చేస్తే ప్రభుత్వం పరిహారం ఎందుకు ఇస్తుందని అన్నారు. ఎవరైనా మద్యం తాగి చనిపోతే అతనిపై దయచూపొద్దు, మద్యం సేవించడం నిషేధించబడాలని నితీష్ కుమార్ అసెంబ్లీ వేదికగా వ్యాఖ్యానించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)