జమ్ముకాశ్మీర్లో భారీ ఉగ్రకుట్రను పోలీసులు భగ్నం చేశారు. జమ్ములోని నర్వాల్ ప్రాంతంలో ముగ్గురు జైషే మహమ్మద్ సానుభూతిపరులను అరెస్టు చేశారు. నర్వాల్లోని జాతీయ రహదారిపై పోలీసులు తనిఖీలు చేస్తుండగా జమ్ముకాశ్మీర్ రిజిస్ట్రేషన్తో ఉన్న ఓ ట్యాంకర్ హైవేపై ఆగిఉండటాన్ని గమనించారు. అనుమానంతో పోలీసులు ఆరా తీయగా డ్రైవర్ను మొహమ్మద్ యాసిన్గా గుర్తించారు. యాసిన్ జైషే ఉగ్ర సంస్థకు సానుభూతిపరుడని, ఇప్పటికే అతనిపై యూఏపీఏ సెక్షన్లపై కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. యాసిన్ తోపాటు ట్యాంకర్ లో ఉన్న ఫర్హాన్ ఫరూఖ్, ఫరూఖ్ అహ్మద్ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించారు. తాము జైషే మహమ్మద్ ఉగ్రసంస్థకు చెందిన షహబాజ్ ఆదేశాల మేరకు ఆయుధాలను ట్యాంకర్ లో తీసుకొచ్చామని, వాటిని లోయలో ఉన్న ఉగ్రవాదులకు అందించాలని వచ్చామని ఒప్పుకున్నారు. ట్యాంకర్ నుంచి మూడు ఏకే-56 రైఫిళ్లు, పిస్తోల్, తొమ్మిది మ్యాగజైన్లు, 191 రౌండ్ల బుల్లెట్లు, ఆరు గ్రనేడ్లు, ఆయుధ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
జమ్ముకాశ్మీర్లో భారీగా ఆయుధాలు స్వాధీనం
November 10, 2022
0
Tags