తమిళిసై గవర్నరో, బిజెపి కార్యకర్తో అర్థం కావడం లేదని సిపిఐ రాష్ట్ర సమితి కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. హైదరాబాద్లోని సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో కూనంనేని సాంబశివరావు మీడియాతో మాట్లాడుతూ తమిళిసై తెలంగాణ నుండి వెళ్లిపోవాలని ఆయన కోరారు. త్వరలోనే రాజ్భవన్ను ముట్టడిస్తామని ఆయన చెప్పారు. బ్రిటీష్ కాలం నుండి వచ్చిన ఈ గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గవర్నర్ తమిళిసై వ్యవహరిస్తున్న తీరును ఆయన తప్పుబట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా గతంలో గవర్నర్ వ్యవస్థలను ఎలా ఉపయోగించుకొని ప్రజలు ఎన్నుకొన్న ప్రభుత్వాలను ఎలా ఇబ్బంది పెట్టారో ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం కేరళ, తెలంగాణ, ఢిల్లీ రాష్ట్రాల్లో గవర్నర్లు వ్యవహరిస్తున్న తీరును కూనంనేని గుర్తు చేశారు. గవర్నర్ వ్యవస్థను పాలకులు తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నారని ఆయన విమర్శించారు. ప్రధానికి తెలంగాణపై ఆనుకోని ప్రేమ పుట్టుకొచ్చిందన్నారు. దురుద్దేశ్యంతోనే మోడీ తెలంగాణలో పర్యటిస్తున్నారని ఆయన విమర్శించారు. గత ఏడాది ప్రారంభమైన ఫ్యాక్టరీని ఇప్పుడు ప్రారంభించేందుకు రావడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. మోడీ పర్యటనను అడ్డుకంటామని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని ఒక్కటి కూడా నెరవేర్చలేదని తెలిపారు. ఈ నెల 10వ తేదీ నుండి సింగరేణి బొగ్గు గనుల్లో ఆందోళనలు చేస్తామని ఆయన ప్రకటించారు. ప్రధాని రాష్ట్రానికి రావడానికి వీల్లేదని ప్రచారం చేస్తామనానరు. ప్రభుత్వ రంగ సంస్థలను మోడీ సర్కార్ నిర్వీర్యం చేసిందని విమర్శించారు.
తమిళిసై గవర్నరో, బిజెపి కార్యకర్తో అర్థం కావడం లేదు !
November 08, 2022
0
Tags