వైఎస్ షర్మిలపై దాడిని తప్పుపట్టిన కొండా సురేఖ !

Telugu Lo Computer
0


ఉమ్మడి వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం శంకరం తండా వద్ద జరిగిన దాడికి నిరసనగా వైఎస్ షర్మిల మంగళవారం ప్రగతి భవన్‌ను ముట్టడికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ ఆందోళనను భగ్నం చేయడంలో భాగంగా పోలీసులు ఆమెను హౌస్ అరెస్ట్ చేశారు. వారి కళ్లు గప్పి ఆమె ప్రగతి భవన్ ముట్టడికి బయలుదేరారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. తొమ్మిది సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం హైకోర్టు ముందు ప్రవేశపెట్టగా.. షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. ఈ ఘటన పట్ల తాజాగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, మాజీ మంత్రి కొండా సురేఖ స్పందించారు. ఈ దాడిని ఆమె తప్పుపట్టారు. ఓ మహిళ నాయకురాలి పట్ల పోలీసులు, ప్రభుత్వం హేయంగా ప్రవర్తించారని మండిపడ్డారు. ఈ మేరకు ఆమె ఓ సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. ఒక రాజకీయ పార్టీ అధినేత్రిపై పోలీసులు గానీ, ప్రభుత్వం గానీ ఇంత దారుణంగా వ్యవహరించకూడదని అన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి సుదీర్ఘకాలంగా పాదయాత్ర చేస్తోన్న ఓ మహిళ నాయకురాలిపై దాడి చేయడం ప్రజాస్వామ్యం అనిపించుకోదని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానాలు, అణచివేతకు ఈ ఉదంతం ఓ నిదర్శనమని విమర్శించారు. క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలను వైఎస్ షర్మిల తన పాదయాత్ర ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తోన్నారని, వాటిని సానుకూల దృష్టితో చూడాల్సిన అవసరం ఉందని అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)