తట్టు వ్యాధి పై డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక

Telugu Lo Computer
0


ప్రపంచవ్యాప్తంగా మీజిల్స్‌ వేగంగా వ్యాపిస్తోంది. చైనా, మంగోలియా, దక్షిణాఫ్రికాతో పాటు పలు దేశాల్లో కేసులు భారీగా పెరుగుతున్నాయి. దేశంలోనూ మహారాష్ట్ర, కేరళతో సహా పలు రాష్ట్రాల్లో మీజిల్స్‌ కేసులు వెలుగు చూస్తున్నాయి. ప్రస్తుతం పరిస్థితి దిగజారుతోందని, మిలియన్లలో పిల్లలు ప్రమాదం అంచున ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఒక్క మిజిల్స్‌ కేసు 12 నుంచి 18 ఇన్ఫెక్షన్స్‌కు దారితీస్తుందని హెచ్చరించింది. వైరస్‌ ఇన్ఫెక్షన్‌ తీవ్రంగా ఉందని తెలిపింది. గతేడాది ప్రపంచవ్యాప్తంగా 9 మిలియన్ల మీజిల్స్‌ కేసులు నమోదవ్వగా, 1.28లక్షల మరణాలు సంభవించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది. దాదాపు 22 దేశాల్లో ఈ వైరస్ విధ్వంసం సృష్టించిందని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం మీజిల్స్‌ వ్యాప్తి కారణం వ్యాక్సినేషన్‌ సరిగా జరుగకపోవడమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. 2021లో రికార్డు స్థాయిలో దాదాపు 40 మంది పిల్లలు మీజిల్స్‌ టీకాను మిసయ్యారు. అలాగే 25 మిలియన్ల మంది పిల్లలకు తొలిడోస్‌ తప్పిపోయారు. 14.7 మంది మిలియన్ల పిల్లలు రెండో డోస్‌ మిస్సయ్యారు. కరోనాకు వ్యతిరేకంగా ప్రభుత్వాలు టీకాల పంపిణీ చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో సాధారణ రోగనిరోధక టీకాల పంపిణీ కార్యక్రమాలు దెబ్బతిన్నాయి. దీంతో మిలియన్ల సంఖ్యలో ప్రాణాంతక వ్యాధుల బారి నుంచి రక్షించే టీకాలను కోల్పోయారు. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ అధనామ్‌ ఘెబ్రేయేసన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఇమ్యునైజేషన్‌ ప్రోగ్రామ్‌ను తిరిగి గాడిలో పెట్టడం చాలా క్లిష్టమైందన్నారు. తట్టు అంటువ్యాధి అయినప్పటికీ.. దీన్ని టీకా ద్వారా పూర్తిగా నివారించవచ్చు. మీజిల్స్‌ బారి నుంచి కాపాడేందుకు, రోగనిరోధకశక్తిని పెంచేందుకు, వైరస్‌ను నిర్మూలించేందుకు రెండు డోసుల మీజిల్స్‌ వ్యాక్సిన్‌ ఇవ్వడం తప్పనిసరి. సమాజ వ్యాప్తిని నివారించేందుకు 95శాతం వ్యాక్సిన్లు వేయడం అవసరం. ప్రపంచవ్యాప్తంగా 81 శాతం మంది పిల్లలు మాత్రమే మొదటి మీజిల్స్‌ వ్యాక్సిన్‌ను, 71శాతం మంది రెండో మోతాదును పొందారు. అంతకుముందు 2008లో ప్రపంచవ్యాప్తంగా అత్యంత తక్కువగా టీకాల పంపిణీ జరిగిందని, అయితే దేశాన్ని బట్టి టీకా కవరేజీ మారుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక పేర్కొంది. 2021లో రికార్డు స్థాయిలో దాదాపు 40 మిలియన్ల మంది పిల్లలు మీజిల్స్ వ్యాక్సిన్ మోతాదును కోల్పోయారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది. 18 దేశాల్లో కొవిడ్‌-19 టీకాల పంపిణీలో జాప్యం కారణంగా దాదాపు 61 మిలియన్ల మీజిల్స్‌ వ్యాక్సిన్‌ డోసుల పంపణీ వాయిదా పడ్డాయి. ఈ జాప్యమే మీజిల్స్‌ వ్యాప్తి చెందే ప్రమాదాన్ని పెంచుతాయి. ప్రస్తుతం 2022లో మీజిల్స్‌ వేగంగా వ్యాప్తి చెందడం అంటే ప్రతీ ప్రాంతానికి ముప్పేనని.. ఈ తరుణంలో ప్రజారోగ్య అధికారులు టీకాల పంపిణీని వేగవంతం చేయడానికి, నిఘాను బలోపేతం చేయడానికి సమయం ఆసన్నమైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయపడింది.

Post a Comment

0Comments

Post a Comment (0)