ముంబైని వణికిస్తున్న 'మీజిల్స్‌' వ్యాధి !

Telugu Lo Computer
0


మహారాష్ట్రలోని ముంబైలో ఇన్‌ఫెక్షన్‌ డిసీస్‌ మీజిల్స్‌ వ్యాధి రోజురోజుకూ విస్తరిస్తోంది. ముంబైలో సోమవారం ఒక్క రోజే 142 రోగులను గుర్తించారు. మంగళవారం రాత్రి వరకు ఆ వ్యాధి లక్షణాలున్న 171 మంది కొత్త రోగులు వివిధ ఆస్పత్రుల్లో చేరారు. దీంతో మొత్తం రోగుల సంఖ్య 1,071కి చేరింది. అందులో ముంబైలోని కస్తూర్బా ఆస్పత్రిలో 68 మంది పిల్లలు చికిత్స పొందుతున్నారు. మృతుల్లో మొత్తం ఏడుగురు పిల్లలుండగా, అందులో ఐదుగురు మీజిల్స్‌ అనుమానిత మృతులున్నారు. ఇద్దరు ఇన్‌ఫెక్షన్‌ డిసీస్‌తో మృతి చెందినట్లు నిర్ధారణ అయింది. మిగతా ఐదుగురు పిల్లలు ఎలా చనిపోయారనేది మూడు రోజుల్లో నివేదిక కానుంది. మొత్తం ఏడుగురు మృతుల్లో కస్తూర్బా ఆస్పత్రిలో నల్గురు, ఇద్దరు రాజావాడి ఆస్పత్రిలో, మరొకరు ఇంటి వద్ద మృతి చెందారు. వీరంతా అక్టోబరు 26వ తేదీ నుంచి నవంబర్‌ 16 మధ్యలో మృతి చెందినట్లు ఆరోగ్య శాఖలో నమోదైంది. ముంబైలోని ఎనిమిది బీఎంసీ వార్డుల్లో ఉన్న మురికివాడల్లో ఈ వ్యాధి లక్షణాలున్న పిల్లలను అత్యధికంగా గుర్తించారు. ఈ వార్డుల్లో 142 మంది రోగులుండగా అందులో ఒక్క మాన్‌ఖుర్ద్‌ రీజియన్‌లో 44 మంది పిల్లలున్నారు. ఇక్కడ కేంద్ర ప్రభు త్వం నియమించిన ముగ్గురు సభ్యులతో కూడిన బృందం పర్యటిస్తోంది. తూర్పు, పశ్చిమ గోవండీ, బైకళ, కుర్లా, వడాల, ధారావి తదితర ఎనిమిది వార్డుల్లో ఇన్‌ఫెక్షన్‌ డిసీస్‌ తొందరగా వ్యాప్తి చెందుతోంది. ఈ రీజియన్లను హై రిస్క్‌ ప్రాంతాలుగా ప్రకటించారు. మురికివాడల్లో ఈ వ్యాధి లక్షణాలున్న మరికొంత మంది పిల్లలు కూడా ఉండవచ్చనే అనుమానంతో ప్రతీ గుడిసెలో సోదా చేయడం ప్రారంభించినట్లు బీఎంసీ ఆరోగ్య శాఖ కార్యనిర్వాహక అధికారి డా.మంగల గోమారే తెలిపారు. ముంబైలో అనేక మంది పిల్లలకు ఎం.ఆర్‌.-1, ఎం.ఎం.ఆర్‌-2 వ్యాక్సినేషన్‌ లభించలేదని అధ్యయనంలో బయటపడింది. దీంతో అదనంగా వ్యాక్సినేషన్‌ శిబిరాలు ఏర్పాటుచేసి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తిచేయాలని భావిస్తున్నట్లు గోమారే తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)