విశాఖలో రాత్రికి రాత్రే దుకాణాలు నేలమట్టం !

Telugu Lo Computer
0


విశాఖపట్నం లోని  పెద్ద వాల్తేరులో బాపన దిబ్బ వద్ద కారు షెడ్లు, హోటల్‌తో పాటు చిన్నచిన్న దుకాణాలు నిర్మించుకుని 30 ఏళ్లుగా జీవనోపాధి సాగిస్తున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయ హాస్టల్‌కు ఆనుకుని ఈ స్థలం ఉంటుంది. కొద్దిరోజులు క్రితం ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో దుకాణాల్ని మూసి ఉంచాలని అధికారులు సమాచారం ఇచ్చారు. ప్రధాని భద్రతలో భాగంగా తాము సహకరిస్తామని దుకాణదారులు అందుకు ఒప్పుకున్నారు. ఇంతలోనే సోమవారం అర్ధరాత్రి తర్వాత కనీస సమాచారం ఇవ్వకుండా మొత్తం దుకాణాలను నేలమట్టం చేశారు. అనేక ఖరీదైన కార్లను ఇక్కడ రిపేర్ చేస్తూ ఉంటారు. ఆ కార్లు కొన్ని పూర్తిగా ధ్వంసమైపోయాయి. ఈ మధ్యనే రెండున్నర లక్షలు ఖర్చుపెట్టి దుకాణాలకు కొత్త రేకులు, రంగులు వేసుకున్నారు. ఇప్పుడా దుకాణాలు నేలమట్టమవడం కావడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ముందస్తు సమాచారం ఇచ్చి ఉంటే సామాన్లు తీసుకునే అవకాశం ఉండేదని వాపోయారు. "మేము 1989-90 సంవత్సరం నుంచి.. ఒక్కొక్కరం దాదాపు రెండు లక్షలు అడ్వాన్స్​లు ఇస్తూ, నెలకు అద్దె చెల్లిస్తూ, అప్పులైనా ఇవి ఉన్నాయనే నమ్మకంతో ఇప్పటి వరకు జీవనం కొనసాగిస్తున్నాము. రాత్రి 12 గంటలకు మాకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా.. తెల్లవారి వచ్చి చూసే సరికి మొత్తం కూల్చేసి ఉన్నాయి". అని ఒక బాధితుడు తన గోడు వెళ్లబోసుకున్నాడు.  బాపన అప్పారావు కుటుంబం ఈ స్థలాన్ని సుప్రీంలో గెలుచుకుందని అయినా.. అర్థరాత్రి షెడ్లను కూల్చివేయడం దారుణమని స్థానిక శాసన సభ్యుడు వెలగపూడి రామకృష్ణబాబు అన్నారు. ఈ స్థలం పైన ఏయూ వీసీ, ఎంపీ విజయసాయిరెడ్డి కన్ను పడిందని.. అందుకే మోదీ పర్యటన పేరుతో వీరి నుంచి లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని రామకృష్ణబాబు ఆరోపించారు. వారికి అండగా తెదేపా, జనసేన, వామపక్షాలు నిలిచాయి. నష్ట పోయిన వారిని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని.. లేని పక్షంలో వైకాపా మినహా అన్ని పార్టీలు ఒకటై పోరాటం చేస్తామని ప్రతిపక్షాలు హెచ్చరిస్తున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)