రైల్వేలో ప్రతి మూడు రోజులకో ఉద్యోగిపై వేటు !

Telugu Lo Computer
0


పనితీరు సరిగా లేని, అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న ఉద్యోగులపై రైల్వే శాఖ కొరఢా ఝుళిపిస్తోంది. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా గత 16 నెలలుగా ప్రతి మూడు రోజులకు ఓ ఉద్యోగిపై వేటు పడుతోంది. 2021 జులై నుంచి ఇప్పటివరకు 139 మంది ఉద్యోగులకు బలవంతంగా స్వచ్ఛంద పదవీ విరమణ ఇచ్చి పంపించగా.. మరో 38 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించినట్లు రైల్వే అధికారి ఒకరు తాజాగా వెల్లడించారు. ''ఉద్యోగుల పనితీరుపై కఠినంగా ఉండాలని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ చాలా స్పష్టంగా చెప్పారు. 2021 జులై నుంచి రైల్వే శాఖలో ప్రతి మూడు రోజులకు ఒక అవినీతిపరుడిని పంపించేశాం'' అని సదరు అధికారి పేర్కొన్నారు. బుధవారం కూడా ఇద్దరు సీనియర్‌ గ్రేడ్‌ అధికారులను విధుల నుంచి తొలగించినట్లు సంబంధిత వర్గాల సమాచారం. ఇందులో ఒకరు హైదరాబాద్‌లో రూ.5లక్షల లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కగా, రాంచీలో మరో అధికారి రూ. 3 లక్షలు తీసుకుంటూ అధికారులకు దొరికిపోయారని సదరు వర్గాలు తెలిపాయి. గతేడాది అశ్వినీ వైష్ణవ్‌ రైల్వే శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉద్యోగుల పనితీరు విషయంలో కఠిన నిబంధనలు తీసుకొచ్చారు. విధులు సక్రమంగా నిర్వర్తించలేకపోతే వీఆర్‌ఎస్‌ తీసుకోవాలంటూ ఇప్పటికే కేంద్రమంత్రి పలుమార్లు ఉద్యోగులను హెచ్చరించారు. ఇక అవినీతికి పాల్పడే ఉద్యోగులను తక్షణమే విధుల నుంచి తొలగించాలని నిర్ణయించారు. దీనిలో భాగంగానే పలువురు ఉద్యోగులపై వేటు పడింది. ఎలక్ట్రికల్‌, సిగ్నలింగ్‌, మెడికల్‌, స్టోర్స్‌, మెకానికల్‌ విభాగాల్లో ఈ కోతలు ఉన్నట్లు తెలుస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)