నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఉత్తర్ప్రదేశ్లో ఏర్పాటు చేసిన ఓ మండపం రికార్డు సృష్టించనుంది. లఖ్నవూలో తాత్కాలికంగా నిర్మించిన అతి ఎత్తైన మండపం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు చేసుకోనుంది. ఇప్పటివరకు కోల్కతాలో ఏర్పాటు చేసిన మండపమే అత్యంత ఎత్తైనదిగా రికార్డు కొనసాగుతోంది. 'లఖ్నవూలోని జానకీపురంలో 136 అడుగుల ఎత్తైన భారీ దుర్గాపూజా మండపాన్ని ఏర్పాటు చేశాం. ఇందుకోసం కోల్కతా, అస్సాం రాష్ట్రాలకు చెందిన 52 మంది కళాకారులు నెలకు పైగా కష్టపడ్డారు. యూపీలోని బృందావన్లో నిర్మితమవుతున్న చంద్రోదయ ఆలయ నమూనాలో దీన్ని ఏర్పాటు చేశాం. ఈ భారీ మండపం నిర్మించేందుకు సుమారు రూ.32 లక్షలు ఖర్చయింది. నిత్యం 70 వేల మంది ఈ మండపంలోని దుర్గాదేవిని దర్శించుకుంటున్నారు. గత 28 ఏళ్లుగా ఇక్కడ మండపాన్ని ఏర్పాటు చేస్తున్నాం' అని దుర్గా పూజా కమిటీ నిర్వాహకులు రాకేశ్ పాండే వెల్లడించారు. ఇప్పటికే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ బృందం దీన్ని సందర్శించి పరిశీలించిందని, నాలుగైదు రోజుల్లో సర్టిఫికెట్ జారీ చేయనున్నట్లు తెలిపారు. దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగే పశ్చిమబెంగాల్లో భారీ మండపాలను ఏర్పాటు చేస్తుంటారు. గతంలో అక్కడ ఏర్పాటు చేసిన 125 అడుగుల ఎత్తైన మండపమే అతిపెద్దదిగా ఇప్పటివరకు రికార్డు నమోదు చేసింది. తాజాగా యూపీలోని మండపం ఆ రికార్డును తిరగరాయనుంది.
గిన్నిస్ బుక్లో ఎక్కనున్న భారీ మండపం !
October 05, 2022
0
Tags