ప్రొ. సాయిబాబాపై తీర్పును నిలిపివేసిన సుప్రీంకోర్టు

Telugu Lo Computer
0


ఢిల్లీ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాకు మావోయిస్టులతో ఆయనకు సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో నమోదైన కేసులో ఆయనతోపాటు ఐదుగురు నిర్దోషులని బాంబే హైకోర్టు శుక్రవారం ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం శనివారం నిలిపేసింది. హైకోర్టు తీర్పుపై మహారాష్ట్ర ప్రభుత్వం చేసిన అపీలును విచారణకు స్వీకరించింది. జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బేలా ఎం త్రివేదీ ధర్మాసనం ఈ ఆదేశాలు ఇచ్చింది. సాయిబాబాను నిర్దోషిగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేశాయి. దీనిపై సుప్రీంకోర్టు శనివారం ప్రత్యేకంగా విచారణ జరిపింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం ప్రకారం సాయిబాబా ను విచారించడానికి ముందుగా అనుమతి పొందలేదనే కారణాన్ని చూపి, సాయిబాబాను నిర్దోషిగా ప్రకటించడం సమంజసం కాదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టు లో వాదించారు. కేసులోని యథార్థాలను పరిశీలించకుండా, కేవలం సాంకేతిక అంశాల ఆధారంగానే హైకోర్టు తీర్పు చెప్పిందన్నారు. యూఏపీఏ చట్టం ప్రకారం అనుమతి పొందకపోవడంపై సాయిబాబా ట్రయల్ కోర్టులో కానీ, ఇతర కోర్టుల్లో కానీ సవాల్ చేయలేదన్నారు. సాయిబాబాను కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఆయన బెయిలు కోసం దరఖాస్తు చేశారని, అయితే ఆయనకు బెయిలు మంజూరు చేసేందుకు కోర్టు తిరస్కరించిందని చెప్పారు. తదుపరి విచారణ కోసం నోటీసులు జారీ చేస్తామని జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం తెలిపింది. బాంబే హైకోర్టు తీర్పును నిలిపివేస్తూ ఆదేశాలిచ్చింది.

Post a Comment

0Comments

Post a Comment (0)