హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో అలయ్ బలయ్ కార్యక్రమం జరిగింది. బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో ఏటా దసరా సందర్భంగా అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అయితే ఈసారి ఆ కార్యక్రమ నిర్వహణ బాధ్యతలను దత్తాత్రేయ కుమార్తె బండారు విజయలక్ష్మి తీసుకున్నారు. నిన్న స్వయంగా చిరంజీవి ఇంటికి వెళ్లి అలయ్ బలయ్ కార్యక్రమానికి ఆహ్వానించారు. బండారు విజయలక్ష్మి ఆహ్వానాన్ని మన్నించిన చిరంజీవి ఈ కార్యక్రమానికి హాజరై మాట్లాడుతూ కుల, మత, వర్గాలకు అతీతంగా నిర్వహిస్తున్న గొప్ప సమ్మేళనం 'అలయ్ బలయ్' అని అన్నారు. ఇలాంటి గొప్ప కార్యక్రమం విశ్వవ్యాప్తం కావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రేమ, సోదరాభావం అనే గొప్ప సందేశాన్ని ఇస్తున్న ఇటువంటి కార్యక్రమాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమ సందేశాన్ని జనంలోకి తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచన కర్త గరికపాటి నరసింహారావు ప్రవచనాలు మొదలుపెట్టే సమయంలో చిరంజీవి ఫోటోలు దిగేందుకు వెళ్లారు. అందరూ చిరంజీవినే గమనిస్తుండడంతో గరికపాటి స్పందించారు. '' చిరంజీవి గారూ.. మీ ఫోటో సెషన్ ఆపేయండి.. లేదంటే నాకు సెలవియ్యండి'' అని వ్యాఖ్యానించారు. దీంతో అందరి దృష్టి గరికపాటిపై పడింది. అంతకుముందు.. గరికపాటికి చిరంజీవి, దత్తాత్రేయ కలిసి సన్మానం చేశారు. కళాకారుల డప్పు చప్పుళ్లు, నృత్యాలకు స్పందించిన చిరంజీవి డోలు కొట్టారు. చిరంజీవి ఉత్సాహం కార్యక్రమాన్ని మరింత హుషారెత్తించింది.
కుల, మత, వర్గాలకు అతీత సమ్మేళనం అలయ్ బలయ్
October 06, 2022
0
Tags