రాయచూరులో రాహుల్ కు ఘన స్వాగతం

Telugu Lo Computer
0


కాంగ్రెస్‌ చేపట్టిన భారత్‌ జోడో పాదయాత్ర శుక్రవారం రాయచూరు జిల్లాలోకి ప్రవేశించింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కర్నూలు జిల్లాలోని పుణ్యక్షేత్రం మంత్రాలయంలో గురువారం రాత్రి విశ్రమించిన రాహుల్‌ శుక్రవారం ఉదయాన్నే బయలుదేరి మాదవరం, తుంగభద్ర వంతెన మీదుగా గిల్లేసుగూరు వద్ద రాయచూరు జిల్లాలోకి ప్రవేశించారు. రాష్ట్రంలోకి ప్రవేశించిన అగ్రనేత పాదయాత్రను స్వాగతించేందుకు కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌తో పాటు ఏఐసీసీ కార్యదర్శి ఎన్‌ఎస్‌ భోసరాజు, రూరల్‌ ఎమ్మెల్యే దద్దల బసనగౌడ రాష్ట్ర, జిల్లా నేతలు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. తుంగభద్ర వంతెన దాటిన వెంటనే జిల్లాలోకి ప్రవేశించే సమయంలో వివిధ కళాబృందాలు కళా ప్రదర్శనలతో వినూత్న రీతిలో రాహుల్‌కు స్వాగతం పలికాయి. తుంగభద్ర వంతెన మొదలుకుని గిల్లేసుగూరు చేరే వరకు దాదాపు 5 కిలో మీటర్ల మేర రోడ్డుకిరువైపుల ప్రజలు భారీ సంఖ్యలో వచ్చి చేరడంతో యాత్ర జాతరను తలపించింది. జనాలను పలకరిస్తూ అభివాదం చేస్తూ వడివడిగా బయలుదేరిన రాహుల్‌ వెంట నడిచేందుకు పార్టీ శ్రేణులు పరుగెత్తే పరిస్థితి కనిపించింది. పాదయాత్రలో ముందు భాగాన కొంత మంది యువకులు మహాత్మాగాంధీ, ఇందిరాగాంధీ ఇతర జాతీయ నేతల వేషధారణలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అనంతరం గిల్లేసుగూర్‌కు చేరుకున్న రాహుల్‌ గణదాళ్‌ మార్గంలో ఏర్పాటు చేసిన పార్టీ క్యాంపు కార్యాలయంలో కొద్దిసేపు సేదదీరారు. అనంతరం ఉపహారం సేవించిన రాహుల్‌ గాంధీ తిరిగి యాత్రను కొనసాగించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)