పెద్ద నోట్ల రద్దు ప్రక్రియపై నవంబరు 9న విచారణ

Telugu Lo Computer
0


రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన అనేక పిటిషన్లపై నవంబరు 9న విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు తెలిపింది. పెద్ద నోట్లను రద్దు చేయడానికి నిర్ణయం తీసుకునేందుకు చేసిన కసరత్తుకు సంబంధించిన అన్ని వివరాలతో అఫిడవిట్లను దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని, భారతీయ రిజర్వు బ్యాంకును సుప్రీంకోర్టు బుధవారం ఆదేశించింది. ఈ పిటిషన్లపై రాజ్యాంగ ధర్మాసనం నవంబరు 9న విచారణ జరుపుతుందని తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2016 నవంబరు 8న పెద్ద నోట్లను రద్దు చేసినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేసినట్లు ఆయన ప్రకటించారు. దీనిని వ్యతిరేకిస్తూ అనేక పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. వీటిపై సెప్టెంబరు 28న విచారణ జరిగింది. అటార్నీ జనరల్ ఆర్ వేంకటరమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ, ఈ అంశం విద్యా సంబంధిత అంశంగా మారిందని, పెద్ద నోట్లను రద్దు చేసి ఆరేళ్లు గడిచిపోయిందని అన్నారు. వెంటనే సీనియర్ అడ్వకేట్లు పి చిదంబరం, శ్యామ్ దివాన్ పిటిషనర్ల తరపున వాదనలు వినిపిస్తూ, ప్రభుత్వ నిర్ణయం చెల్లుబాటుపై సవాలు చేయడానికి ఇప్పటికీ అవకాశం ఉందన్నారు. కార్యనిర్వాహక ఆదేశాల ద్వారా కరెన్సీ నోట్లను రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి లేదని తెలిపారు. ఈ సమస్య భవిష్యత్తుకు కూడా సంబంధించినదని పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన 58 పిటిషన్లపై జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ వీ రామసుబ్రహ్మణ్యం, జస్టిస్ బీవీ నాగరత్న రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరుపుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)