నటి, బీజేపీ నేత సోనాలి ఫోగట్ హత్య కేసులో మరో కొత్త విషయం వెలుగుచూసింది. సోనాలి కుటుంబానికి అజ్ఞాతవ్యక్తి నుంచి రెండు లేఖలు అందాయి. వాటిలో ఒక దానిలో రూ.10 కోట్లు చెల్లిస్తామని, డీల్ కుదుర్చుకోవాలని అజ్ఞాత వ్యక్తి కోరాడు. రెండో లేఖలో రాజకీయ నేతల పేర్లు ప్రస్తావించినట్టు తెలుస్తోంది. అజ్ఞాత వ్యక్తి నుంచి రెండు లేఖలు వచ్చిన విషయాన్ని సోనాలి బావ అమన్ పూనియా ధృవీకరించారు. ఈ కేసుకు సంబంధించి తమ వద్ద ఉన్న కీలక సమాచారంపై విచారణ జరపాలని అన్నారు. రెండు లేఖల్లో ఒకటి గత నెలలో వచ్చిందని, ఆ తర్వాత కొద్ది రోజులకు మరో లేఖ వచ్చిందని ఆయన చెప్పారు. కాగా, తన సోదరి హత్య కేసులో బీజేపీ నేత కుల్దీప్ భిష్ణోయ్ ప్రమేయం ఉందని ఆమె సోదరుడు గతంలో ఆరోపించారు. కాగా, అదంపూర్ నుంచి సోనాలి సోదరి రుకేష్ పోటీ చేయనున్నట్టు అమన్ తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీతో తమకెలాంటి సంబంధం లేదని ఆయన వివరణ ఇచ్చారు. తాము ఇప్పటికీ భారతీయ జనతా పార్టీలో ఉన్నామని చెప్పారు. సోనాలి ఫోగత్ ఆగస్టు 23న గోవాలో మృతి చెందారు. తొలుత దీనిని సాధారణ మరణంగా భావించినప్పటికీ పోస్ట్మార్టం నివేదక అనంతరం గోవా పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఫోగట్ సన్నిహితులైన సుధీర్ సాగ్వాన్, సుఖ్వీందర్ సింగ్లను అరెస్టు చేసి వారిపై హత్య కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆ ఇద్దరూ కల్వలె సెంట్రల్ జైలులో ఉన్నారు. ఈ కేసును సీబీఐ చేత దర్యాప్తు చేయించేందుకు కోర్టు అనుమతించింది.
రూ.10 కోట్లకు డీల్ కుదుర్చుకోవాలంటూ లేఖలు
October 09, 2022
0
Tags