ఢిల్లీలో తిరంగా ర్యాలీ !

Telugu Lo Computer
0


దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద చేపట్టిన తిరంగా ర్యాలీకి ప్రతిపక్ష ఎంపీలు హాజరుకాలేదు. ఎర్రకోట నుంచి పార్లమెంట్ సమీపంలోని విజయ్ చౌక్ వరకు ఎంపీలు బుధవారం 'తిరంగా ర్యాలీ' పేరుతో బైక్ ర్యాలీ చేపట్టారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా నిర్వహిస్తున్న 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్'లో భాగంగా, అమరులైన స్వాతంత్ర్య వీరులను స్మరించుకునేందుకు ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి స్మృతి ఇరానీతోపాటు పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీయేతోపాటు ఇతర పార్టీలకు చెందిన ఎంపీలు హాజరయ్యారు. అయితే, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీతోపాటు సమాజ్ వాదీ పార్టీ, ఆమ్ ఆద్మీ, టీఎమ్‌సీ, ఎన్సీపీ ఎంపీలు హాజరుకాలేదు. దీనిపై బీజేపీ విమర్శలు చేసింది. ఇది పార్టీలకు అతీతంగా జరిగే కార్యక్రమమని, దీన్ని బహిష్కరించడం సరికాదని బీజేపీ వ్యాఖ్యానించింది. ''ఇది బీజేపీ కార్యక్రమం కాదు. పార్లమెంట్ ఆధ్వర్యంలో దేశమంతా జరిగిన కార్యక్రమం. అలాంటి ర్యాలీని బహిష్కరించిన వాళ్లే రాష్ట్రపతిని, సుప్రీంకోర్టును, ఎలక్షన్ కమిషన్‌ను ప్రశ్నిస్తారు'' అని బీజేపీ నేతలు అన్నారు. దీనికి కాంగ్రెస్ బదులిచ్చింది. బీజేపీ అజెండాను తామెందుకు అనుసరించాలని ప్రశ్నించింది. ''నిజమైన దేశ భక్తులెవరో అందరికీ తెలుసు. స్వాతంత్ర్రోద్యమ సమయంలో కీలక పాత్ర పోషించిన పత్రికలు ఇప్పుడు వారికి టార్గెట్‌గా మారాయి. బీజేపీ వాళ్లు ఖాదీని అంతం చేసి, చైనా నుంచి జెండాలు దిగుమతి చేసుకుంటున్నారు. జాతీయ జెండా కోడ్ కూడా మార్చేశారు. బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికి తేడా లేదు. వాళ్లకు ఇదొక చిన్న కార్యక్రమం. కానీ, మాకు ఒక బాధ్యత. వీలైతే ప్రధాని మోదీ.. ఆర్ఎస్ఎస్, మోహన్ భగవత్ తమ సోషల్ మీడియా డీపీలుగా జాతీయ జెండాలను పెట్టుకునేలా చేయమనండి'' అని కాంగ్రెస్ నేత అధిర్ రంజాన్ చౌదురి వ్యాఖ్యానించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)