స్పైస్జెట్ బి737 అనే ఎయిర్ క్రాఫ్ట్ ఢిల్లీ నుంచి దుబాయ్ బయల్దేరింది. అయితే, మధ్యలో ఫ్యుయెల్ ఇండికేటర్ లైట్లో సమస్య తలెత్తింది. ఎడమవైపు ట్యాంకులో ఇంధనం భారీగా తగ్గినట్లు ఇండికేటర్ సూచించింది. దీంతో విమానాన్ని కరాచీ మళ్లించారు. అయితే, ఇది ఎమర్జెన్సీ ల్యాండింగ్ లేదా ప్రయారిటీ ల్యాండింగ్ కాదని, నార్మల్ ల్యాండింగే అని స్పైస్జెట్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. విమానం కరాచీలో సురక్షితంగా ల్యాండ్ అయినట్లు, ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నట్లు చెప్పారు. ప్రయాణికుల్ని కరాచీ నుంచి తరలించడానికి మరో విమానాన్ని అక్కడికి పంపించినట్లు తెలిపారు. ముందుగా జరిపిన తనిఖీల్లో ఎలాంటి సమస్య కనిపించలేదన్నారు. ఇటీవల స్పైస్జెట్ విమానాలకు సంబంధించి ఏదో ఒక ఘటన సంచలనం సృష్టిస్తోంది. మూడు రోజుల క్రితం ఒక స్పైస్జెట్ విమానంలో పొగలు వ్యాపించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ నుంచి జబల్పూర్ వెళ్తున్న ఒక విమానంలో పొగలు రావడంతో, విమానాన్ని తిరిగి ఢిల్లీ తీసుకొచ్చారు. గత నెల 19న మరో విమానం ఇంజిన్లో మంటలు రావడంతో అత్యవసరంగా పాట్నాలో ల్యాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు ఈమధ్య కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి. 17 రోజుల్లో ఇలాంటి ఘటనలు జరగడం ఇది ఆరోసారి.
స్పైస్ జెట్ విమానం కరాచీలో ఎమర్జెన్సీ ల్యాండ్
July 05, 2022
0
Tags