అద్దెకున్న యువతి ఆగడం !

Telugu Lo Computer
0


గ్రేటర్‌ నోయిడాకు చెందిన సునీల్‌ కుమార్‌ భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో పనిచేసి రిటైర్‌ అయ్యారు. ఈయనకు నోయిడాలోని సెక్టార్ 16బీ ప్రాంతంలో ఓ అపార్ట్‌మెంట్‌లో సొంత ఫ్లాట్‌ ఉంది. అయితే వృత్తిరీత్యా సునీల్‌ ముంబయిలో విధులు నిర్వహించడంతో గతేడాది జులైలో ప్రీతి అనే యువతికి అద్దెకిచ్చారు. 11 నెలల పాటు అద్దెకుండేలా ఒప్పందం చేసుకోగా, ఈ ఏడాది జూన్‌ 10తో అగ్రిమెంట్ ముగిసింది. ఈ ఏడాది మార్చిలో పదవీ విరమణ పొందిన సునీల్‌ తిరిగి తన సొంతింటికి రావాలనుకున్నారు. ఈ విషయాన్ని ఏప్రిల్‌లోనే ప్రీతికి తెలియజేశారు. అగ్రిమెంట్‌ పూర్తయ్యాక ఇల్లు ఖాళీ చేస్తే తాము తమ ఇంటికి వచ్చేస్తామని చెప్పారు. ఇందుకు ప్రీతి కూడా ఒప్పుకోవడంతో రెండు నెలల క్రితం సునీల్‌ తన భార్య రాఖీ గుప్తాతో కలిసి నోయిడాకు వచ్చేశారు. ప్రీతి ఇల్లు ఖాళీ చేస్తే అక్కడకు మారొచ్చు అనుకుని అప్పటిదాకా బంధువుల ఇంట్లో ఉన్నారు. అయితే అగ్రిమెంట్ గడువు పూర్తయినా ప్రీతి ఇల్లు ఖాళీ చేసేందుకు ఒప్పుకోలేదు. దీంతో సునీల్‌ పోలీసులను ఆశ్రయించారు. అయితే ఇది సివిల్‌ కేసు అయినందున కోర్టుకు వెళ్లాలని పోలీసులు సూచించారు. దీంతో చేసేదేం లేక, సునీల్‌ దంపతులు న్యాయపోరాటానికి దిగారు. తమ వస్తువులతో కలిసి సొంతింటి మెట్ల మీద కూర్చున్నారు. ఈ విషయం కాస్తా స్థానిక మీడియాలో రావడంతో వైరల్‌ అవడమేగాక, స్థానిక అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో వారం రోజులు వారు చేసిన పోరాటానికి గురువారం ఫలితం లభించింది. అధికారులు, ఇరుగు పొరుగు జోక్యంతో అద్దెకున్న యువతి ఇల్లు ఖాళీ చేయడంతో ఎట్టకేలకు నిన్న రాత్రి వారు తమ సొంతింట్లోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా వారు ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు.

Post a Comment

0Comments

Post a Comment (0)