కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో అధికార భారతీయ జనతా పార్టీ యువమోర్చా నాయకుడిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా నరికి చంపారు. ఈ విషయం తెలిసిన వెంటనే జిల్లాస్థాయి బీజేపీ నాయకులు, యువమోర్చా కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. అర్ధరాత్రి నిరసన ప్రదర్శనలను చేపట్టారు. రోడ్డుపై బైఠాయించారు. వుయ్ వాంట్ జస్టిస్ అంటూ నినదించారు. రాత్రాంతా దక్షిణ కన్నడ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హతుడి పేరు ప్రవీణ్ నెట్టారు. దక్షిణ కన్నడ జిల్లా బీజేపీ యువమోర్చా నాయకుడు. జిల్లాలోని సుళ్య తాలుకా బెళ్లారపేటె ఆయన స్వస్థలం. కేరళ సరిహద్దులకు సమీపంలో ఉంటుందీ గ్రామం. స్థానికంగా ఓ పౌల్ట్రీ షాప్ను నిర్వహిస్తోన్నారు. రాత్రి షాప్ను మూసివేసి, ఇంటికి బయలుదేరి వెళ్తోన్న సమయంలో దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆయనను బైక్పై వెంటాడి మరీ నరికి చంపారు. షాప్ షట్టర్ను క్లోజ్ చేస్తోన్న సమయంలో ఇద్దరు వ్యక్తులు బైక్పై ఆయన వద్దకు వచ్చి, ఆ వెంటనే కత్తులతో దాడికి దిగారు. దీనితో ఆయన తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నించగా, బైక్పై వెంటాడి నరికి చంపారు. రక్తపు మడుగులో పడివున్న అతణ్నిస్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు హుటాహుటిన పుత్తూరు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రవీణ్ మరణించారు. ఈ విషయం తెలిసిన వెంటనే స్థానిక బీజేపీ నాయకులు, యువమోర్చా కార్యకర్తలు పెద్ద ఎత్తున పుత్తూరుకు తరలివచ్చారు. అక్కడే బైఠాయించారు. నిరసన ప్రదర్శనలకు దిగారు.
బీజేపీ యువమోర్చా నాయకుడి దారుణ హత్య
July 27, 2022
0