నామా నాగేశ్వరరావు ఆస్తులను జప్తు చేసిన ఈడీ

Telugu Lo Computer
0


తెలంగాణలో బీజేపీ కార్యవర్గ సమావేశాలు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా పర్యటన నేపథ్యంలో రాజకీయ వేడి రగులుకుంది. హైదరాబాద్‌లో రెండు కీలక సమావేశాలు జరగుతున్న వేళ రాష్ట్రంలో అధికార పార్టీ టీఆర్‌ఎస్‌కు చెందిన ఎంపీ నామా నాగేశ్వరరావుకు చెందిన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. రాంచీ ఎక్స్‌ప్రెస్‌ హైవే కేసులో మధుకాన్‌ గ్రూప్‌ కంపెనీల ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసింది. రాజకీయాల్లోకి రాకముందే మధుకాన్ ప్రాజెక్ట్స్ పేరిట నామా నాగేశ్వరరావు ఓ కంపెనీని స్థాపించారు. ఈ కంపెనీ పలు రంగాలకు విస్తరించి తన పేరును మధుకాన్ గ్రూప్‌గా మార్చుకుంది. నిర్మాణ రంగంలో ఉన్న ఈ కంపెనీ గతంలో రాంచీలో ఎక్స్‌ప్రెస్ హైవేను నిర్మించింది. రాంచీ- జంషెడ్‌పూర్‌ రహదారి పేరిట బ్యాంకుల నుంచి మధుకాన్‌ గ్రూప్‌ రూ.10.30కోట్ల రుణాలు పొంది దారి మళ్లించినట్టు ఈడీ 2002లో ఈడీ కేసు నమోదు చేసింది. ఆరు డొల్ల కంపెనీల ద్వారా నిధుల మళ్లింపు జరిగిందని ఈడీ గుర్తించింది. ఈ కంపెనీలు నామా నాగేశ్వరరావు, నామా సీతయ్య ఆధీనంలో ఉన్నాయని తెలిపింది. ఈ కేసులో 96.21 కోట్ల విలువైన మధుకాన్‌ ఆస్తులను ఈడీ జప్తు చేసింది. హైదరాబాద్‌, బెంగాల్‌, విశాఖ, ప్రకాశం, కృష్ణా జిల్లాలో రూ.88.85 కోట్ల విలువైన భూములు, మధుకాన్‌ షేర్లు సహా రూ.7.36 కోట్ల చరాస్తులను ఈడీ అటాచ్‌ చేసింది. శనివారం హైదరాబాద్ వచ్చిన విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు బేగంపేట విమానాశ్రయంలో సీఎం కేసీఆర్‌తో కలిసి స్వాగతం పలికారు. అనంతరం జల విహార్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలోనూ ఆయన పాలుపంచుకున్నారు. ఈ సమావేశంలో ఉన్న సమయంలోనే నామా సంస్థలపై ఈడీ కొరడా ఝుళిపించడం గమనార్హం.

Post a Comment

0Comments

Post a Comment (0)