ఎస్డీఆర్ఎఫ్ ఖాతాలకు నిధులు బదిలీ చేయండి !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం ఎస్డీఆర్ఎఫ్ నిధులను వ్యక్తిగత ఖాతాలకు మళ్లిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఆ నిధులను రెండు రోజుల్లోగా తిరిగి ఎస్డీఆర్ఎఫ్ ఖాతాలకు బదిలీ చేయాలని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్‌లో స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్డీఆర్ఎఫ్) నిధులను ప్రభుత్వం వ్యక్తిగత ఖాతాలకు మళ్లించడంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ ఎమ్.ఆర్.షా, జస్టిస్ బి.వి.నాగరత్న ఆధ్వర్యంలోని సుప్రీం ధర్మాసనం తాజా ఆదేశాలు జారీ చేసింది. రెండు రోజుల్లోగా పర్సనల్ డిపాజిట్ అకౌంట్స్ నుంచి నిధులను ఎస్డీఆర్ఎఫ్‌కు తిరిగి బదిలీ చేయాలని ఆదేశించింది. అలాగే అర్హులైన వారికి పరిహారం చెల్లించకపోవడం, కొంతమంది దరఖాస్తులు తిరస్కరించడం వంటి అంశాలపై కూడా ధర్మాసనం స్పందించింది. ఎవరైనా పరిహారం కోసం దరఖాస్తు చేసుకుంటే, దీనికోసం ఏర్పాటైన కమిటీ నాలుగు వారాల్లోనే పరిహారం అందజేయాలని సూచించింది. అర్హులైన వారికి పరిహారం అందించడంలో సమయం వృథా చేయకూడదని, పరిహార కమిటిని ఆశ్రయిస్తే వెంటనే పరిష్కరించాలని సుప్రీంకోర్టు సూచించింది. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. పల్లా శ్రీనివాస రావు అనే వ్యక్తి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎస్డీఆర్ఎఫ్ నిధుల్ని ప్రభుత్వం వ్యక్తిగత ఖాతాలకు మళ్లించడం నిబంధనలకు విరుద్ధమని పల్లా తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రత్యేక అవసరాల కోసం కేటాయించిన నిధులను ఇతర అవసరాలకు వాడుకోవడం సరికాదని ఆయన పిటిషన్‌లో వివరించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)