సల్మాన్‌ఖాన్‌కు బెదిరింపు లేఖ

Telugu Lo Computer
0


బాలీవుడ్‌ ప్రముఖ నటుడు సల్మాన్‌ఖాన్‌కు బెదిరింపుల లేఖ కేసులో ముంబయి పోలీసులు పురోగతి సాధించారు. నటుడు సల్మాన్ తండ్రి సలీం ఖాన్‌కు లేఖను అందించిన వ్యక్తులను ముంబై పోలీసులు ఎట్టకేలకు గుర్తించారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన నిందితుడు సిద్ధేష్ హిరామన్ కాంబ్లే అలియాస్ మహాకల్‌ను విచారించిన సందర్భంగా ఈ విషయం వెల్లడైంది. బిష్ణోయ్ సహాయకుడు విక్రమ్ బరాద్ లేఖను సలీంఖాన్‌కు ఇచ్చినట్లు నిందితుడు మహాకల్ వెల్లడించాడని ముంబై పోలీసులు చెప్పారు. జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సల్మాన్ ఖాన్, అతని తండ్రి సలీం ఖాన్‌ కోసం ఈ లేఖను విడుదల చేసినట్లు ముంబై పోలీసులు తెలిపారు. అతని ముఠాలోని ముగ్గురు వ్యక్తులు లేఖను ఇవ్వడానికి రాజస్థాన్‌లోని జలోర్ నుంచి ముంబైకి వచ్చి నిందితుడు సౌరభ్ మహాకల్‌ను కలిశారని ముంబై పోలీసులు తెలిపారు.ఈ లేఖను అందించిన వ్యక్తులను క్రైమ్ బ్రాంచ్ గుర్తించినట్లు ముంబై పోలీసులు తెలిపారు. లేఖ ఇచ్చిన వారి ఆధారాలు ఉన్నాయని.. వారిని త్వరలోనే అరెస్టు చేసేందుకు 6 బృందాలను దేశంలోని వివిధ ప్రాంతాలకు పంపించామని వెల్లడించారు. సల్మాన్‌, ఆయన తండ్రిని బెదిరిస్తూ ఇటీవల ఆయన నివాసానికి గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఓ లేఖ వచ్చిన విషయం తెలిసిందే. రోజూ జాగింగ్‌ అయ్యాక సల్మాన్‌ కూర్చునే బెంచిపై ఈ లేఖ లభించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ''త్వరలో సిద్ధూ మూసేవాలా లాంటి పరిస్థితే మీకు ఎదురవుతుంది'' అంటూ దుండగులు ఆ లేఖలో బెదిరించారు. లేఖపై జి.బి, ఎల్‌.బి అనే అక్షరాలు ఉన్నాయి. దీంతో ఆ అక్షరాలను గోల్డీ బ్రార్‌, లారెన్స్‌ బిష్ణోయ్‌ పేర్లకు షార్ట్‌కట్‌గా పోలీసులు అనుమానించారు. అయితే ఈ లేఖను బిష్ణోయ్‌ ముఠానే పంపించిందా లేదా ఎవరైనా అతడి పేరుతో బెదిరింపులకు పాల్పడ్డారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టి.. లారెన్స్‌ బిష్ణోయ్ ఈ లేఖను పంపినట్లు తెలుసుకున్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)