ఖమ్మం- సూర్యాపేట హైవే త్వరలో సిద్ధం !

Telugu Lo Computer
0


ఖమ్మం జిల్లాలో తొలి జాతీయ రహదారి అయిన ఖమ్మం--సూర్యాపేట హైవే పనులు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్​ వరకు ఈ నేషనల్ హైవేను పూర్తిచేసి, జాతికి అంకితం చేసేందుకు ప్లాన్​ చేస్తున్నారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ జూన్​లోనే పనులు పూర్తి కావాల్సి ఉన్నా, రెండేళ్లుగా కొవిడ్, కూలీల కొరత కారణంగా ఆలస్యమయ్యాయి. బీటీ రోడ్డు పనులు దాదాపు పూర్తి కాగా, అండర్​ పాస్​ లు, కల్వర్టులు, బ్రిడ్జిలు నిర్మిస్తున్న దగ్గర మాత్రమే కొంత ఎర్త్ వర్క్, కనెక్టివిటీ పెండింగ్ ఉందని ఎన్ హెచ్ఏఐ అధికార్లు  చెబుతున్నారు. మరో మూడు నెలల్లో వర్క్​ కంప్లీట్ చేస్తామని అంటున్నారు. ఖమ్మం-సూర్యాపేట మధ్య 59 కిలోమీటర్ల దూరం ఉంది. ఇంతకాలం స్టేట్ హైవే డబుల్ రోడ్డు మాత్రమే ఉండగా, వాహనాల రద్దీ పెరగడం, రోడ్డు డ్యామేజీ కారణంగా ప్రయాణానికి రెండు గంటలకు పైగా సమయం పట్టేది. ఈ రోడ్డు ప్రాధాన్యాన్ని గుర్తించి హైదరాబాద్​ నుంచి ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాలకు వెళ్లేందుకు 2019లో సూర్యాపేట నుంచి ఖమ్మం మీదుగా ఏపీలోని దేవరపల్లి వరకు నేషనల్​ హైవేను కేంద్రం మంజూరు చేసింది. ఇందులో సూర్యాపేట నుంచి ఖమ్మం వరకు 58.626 కిలోమీటర్ల దూరాన్ని 365 బీబీ పేరిట మొదటి బిట్టుగా, ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు గ్రీన్​ ఫీల్డ్ హైవేను మరో బిట్టుగా పనులు చేపట్టింది. సూర్యాపేట - ఖమ్మం రహదారిని రూ.2,094.15 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టారు. ఇందులో భూసేకరణ వ్యయం పోను రూ.1,555.30 కోట్లతో రోడ్డు నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం 49.55 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులు మూడు నెలల్లోగా కంప్లీట్ అవుతాయని ఆఫీసర్లు చెబుతున్నారు. గత రెండేళ్లలో కొవిడ్ వల్ల పనులు లేట్ కావడంతో మరో మూడు నెలలు టైమ కావాలని కాంట్రాక్ట్ సంస్థ కోరగా, నేషనల్​ హైవే అధికారులు ఓకే చెప్పారు. హైవే పూర్తయితే హైదరాబాద్​ నుంచి ఖమ్మం మీదుగా ఏపీలోని ఏలూరు, జంగారెడ్డిగూడెం, రాజమండ్రి, వైజాగ్ వెళ్లే ప్రయాణికులకు జర్నీ మరింత సులువు కానుంది. సూర్యాపేట జిల్లా టేకుమట్ల నుంచి ఈ హైవే ప్రారంభమైంది. హైదరాబాద్​ నుంచి వచ్చే వాహనాలు సూర్యాపేట ఊర్లోకి వెళ్లాల్సిన అవసరం లేకుండా పిల్లలమర్రి, ఐలాపురం, చివ్వెంల సబ్​స్టేషన్​ వరకు 18 కిలోమీటర్ల బైపాస్​ రోడ్డు నిర్మించారు. అక్కడి నుంచి ఖమ్మం,- సూర్యాపేట మధ్య ఉన్న పాత రోడ్డులో కలుస్తుంది. ఇక్కడి నుంచి డబుల్ రోడ్డును ఫోర్​ లేన్​గా మార్చారు. మోతె మండల కేంద్రంలో బైపాస్​ రోడ్డు వేయగా, హుస్సేనాబాద్, మామిళ్లగూడెం, నాయకన్​గూడెం వరకు పాత రోడ్డును వెడల్పు చేశారు. ఇక ఖమ్మం జిల్లాలో బైపాస్​ రోడ్డు ప్రారంభం కాగా, జుజ్జులరావుపేట, కూసుమంచి, జీళ్ల చెర్వు, తల్లంపాడు, మద్దులపల్లి వరకు కొత్త బైపాస్​ వేశారు. పాలేరు సమీపంలో నాగార్జున సాగర్​ కాల్వల మీద, పాలేరు వాగు మీద పెద్ద బ్రిడ్జిలు నిర్మిస్తున్నారు. దాదాపు 8 గ్రామాల్లో స్థానికుల అవసరాల కోసం అండర్​ పాస్​లు, సర్వీస్​ రోడ్లు నిర్మిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)